ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు .. ఆర్జిత సేవలు, దర్శన కోటా విడుదల అప్పుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 07:12 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లు కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.


వివిధ కోటాల వివరాలు..


ఆర్జిత సేవా టోకెన్లు


కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయ‌నుంది.


అంగ ప్రదక్షిణ టోకెన్లు


అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను కూడా నవంబర్ 24 ఉదయం 11 గంటలకు విడుదల చేయ‌నుంది.


వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాలు


వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (రూ. 300 దర్శనం టికెట్) కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా


తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. కాగా, భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.


కార్తీక వనభోజన కార్యక్రమం


పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ఆదివారం (నవంబర్ 16) శ్రీవారి మెట్టు వద్ద గల పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం జరిగింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa