వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైళ్లో ఉన్న సమయంలో తన కుటుంబానికి ఎవరూ అండగా నిలబడలేదన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్ కాస్ట్లో మాట్లాడిన నందిగం సురేష్ పలు కీల వ్యాఖ్యలు చేశారు. జైళ్లో ఉన్న సమయంలో ఏం జరిగిందనే దానిపై పలు విషయాలు పంచుకున్నారు. టీడీపీ కార్యకర్త కృష్ణపై దాడి చేసి గాయపరిచిన కేసులో నందిగం సురేష్ను 2025 మే 18న పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వటంతో జులై రెండో తేదీన గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఏపీలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్ రెండు సార్లు జైలుకు వెళ్లొచ్చారు. మొత్తం 190 రోజుల పాటు ఆయన జైళ్లో ఉన్నారు.
తన విశ్వసనీయతను చూసి వైఎస్ జగన్ తనను దగ్గరకు తీసుకున్నారని నందిగం సురేష్ అన్నారు. అయితే వైసీపీలోని కొంతమందికి అది నచ్చలేదన్నారు. తనపై ఏయే కేసులు పెడితే ఇబ్బంది పెట్టొచ్చనే దానిపైనా తమ పార్టీవారే సపోర్ట్ చేసినట్లు తనతో కొంతమంది చెప్పారన్నారు. తమ పార్టీలోని కొంతమంది తనను చూసి అసూయ పడ్డారన్నారు. ఎంపీ అయిన తర్వాత ముప్పు ఉందనే కారణంగానే తనకు సెక్యూరిటీ ఇచ్చారన్నారు. అయితే అదే కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చని నందిగం సురేష్ అభిప్రాయపడ్డారు. ఎంపీ పదవిని ఎంజాయ్ చేసిన దానికంటే బాధలు ఎక్కువ పడ్డానన్నారు. పదవిలోఉన్నప్పుడు ఎంతోమంది అవసరాలకు వాడుకున్నారని.. అయితే కష్ట సమయంలో అండగా నిలబడలేదన్నారు.
తాను జైళ్లో ఉన్న సమయంలో మొదటి వాయిదాకు కోర్టు వద్దకు తీసుకొచ్చినప్పుడు.. తన తల్లి చూడ్డానికి వచ్చిందని.. పోలీసులు ఆమెను నిర్దాక్షిణ్యంగా నెట్టేశారని నందిగం సురేష్ చెప్పారు. తన కూతురిని కూడా అలాగే నెట్టేశారంటూ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు క్యారేజీ తీసుకువస్తే.. దానిని కూడా లాక్కుని కిందపడేశారన్నారు. తనను ట్రీట్ చేసినట్లే అగ్రవర్ణాలకు చెందిన ఎంపీని కూడా చూడగలరా అని ఆయన ప్రశ్నించారు.
"జైళ్లో ఉన్న సమయంలో నాకు ఏదైనా జరిగితే.. నేను ఏదైనా చేసుకుంటే నిన్ను వదిలేస్తారా నాన్నా అని నా 15 ఏళ్ల కూతురు ఏడుస్తూ అడిగింది. ఇంకా ఎన్ని రోజులు జైళ్లో ఉంటావ్ నాన్నా అని అడిగింది. నా కూతురికి అలాంటి ఆలోచన వచ్చేలా వారు ప్రవర్తించారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందా.. ఆ సమయంలో వైసీపీలోని రఘురాం, పేర్ని నాని, కిరణ్ బలసాని, చిరంజీవి, అప్పిరెడ్డి.. వీరు మాత్రమే సపోర్ట్ చేశారు. మిగతా అందరూ లైట్ తీసుకున్నారు.జైళ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రాత్రి 10, 11 గంటలకు పడుకోలేదు. ఓసారి జైలు సూపరిటెండెంట్ వచ్చారు. స్పెషల్ గార్డును పెట్టారు. నేను ఏంటని అడిగితే.. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చిందన్నారు."
"నేను జైళ్లో ఉన్నప్పుడు మా కుటుంబం దగ్గర డ్రైవర్గా ఉండేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. జైలు వద్దకు రావాలన్నా కూడా బంధువుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. పార్టీలో ఉన్న చాలా మంది.. అధికారంలో ఉన్నప్పుడు నన్ను వాడుకున్న వాళ్లు కూడా అండగా నిలబడలేదు. ఆ సమయంలో మా కుటుంబం మొత్తం ఒంటరిగా మారిపోయింది.. జగనన్న ఉన్నాడనే నమ్మకంతోనే ఉండిపోయాం. జగనన్న సపోర్టుతో పాటుగా మరికొందరి మద్దతు ఉంటే బాగుండేది. జగనన్న తన కేసును ఎలా డీల్ చేస్తారో.. అలాగే నా కేసును కూడా చూసుకున్నారు. ఆ సమయంలో నా భార్యతో ఒకే మాట చెప్పా.. కారు, ఇళ్లు. ఆఫీస్ అన్నీ పోయినా.. నేను బతికుండాలని కోరుకో అని చెప్పా" అంటూ నందిగం సురేష్ భావోద్వేగానికి గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa