ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శుభవార్త వినిపించింది. పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలోఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్ శివప్రసాద్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ ఆధార్ క్యాంపుల ద్వారా ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసులోపు పిల్లలు పాఠశాల వద్దే తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. అయితే ఈ సేవలను ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే వీలుంది.
మరోవైపు ఆధార్ కార్డు అనేది..ప్రస్తుతం అన్నింటికి ఆధారంగా మారిపోయింది. స్కూల్ అడ్మిషన్లు మొదలుకొని.. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ధి వరకూ అన్నింటికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి. ఐదేళ్ల లోపు పిల్లలకు బాల ఆధార్ కార్డు ఇస్తారు. అయితే పిల్లలకు ఫింగర్ ప్రింట్ వంటివి పడకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోవైపు అక్టోబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డుల సేవా రుసుములు కూడా పెరిగాయి. గతంలో పేరు, పుట్టిన తేదీ వంటివి మార్చుకోవడానికి రూ.50 ఫీజు ఉండేది. అది కాస్తా ఇప్పుడు 75 రూపాయలకు చేరుకుంది. అలాగే ఆధార్ కార్డులో సాధారణ బయోమెట్రిక్ అప్డేట్ కోసం గతంలో రూ.100 వసూలు చేసేవారు. ఇప్పుడా మొత్తం రూ.125కు చేరుకుంది, డాక్యుమెంట్ అప్డేట్ కోసం గతంలో రూ.50 తీసుకుంటే ప్రస్తుతం రూ.75 తీసుకుంటున్నారు.
అయితే కొన్ని సేవలు ఉచితంగానే అందిస్తున్నారు. పుట్టిన పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవడం కోసం ఎలాంటి డబ్బులు అవసరం లేదు. అలాగే 5 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల లోపువారు తమ బయోమెట్రిక్ వివరాలను ఫ్రీగానే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa