ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం

international |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 06:38 AM

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్నేయ కాంగోలోని ఓ రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద గని ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.లుఅలాబా ప్రావిన్స్‌లోని కలాండో గని వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గని వద్ద భద్రతగా ఉన్న సైనికులు గాల్లోకి కాల్పులు జరపడంతో కార్మికుల్లో భయాందోళనలు చెలరేగాయని కాంగో ఆర్టిసానల్ మైనింగ్ ఏజెన్సీ  తెలిపింది. ప్రాణభయంతో కార్మికులు అక్కడున్న ఓ ఇరుకైన వంతెనపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో అది బరువును తట్టుకోలేక కుప్పకూలింది. దీంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక, తొక్కిసలాటలో చాలామంది మరణించినట్లు ఏజెన్సీ వివరించింది.ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్లు ప్రావిన్షియల్ మంత్రి కౌంబా అధికారికంగా ప్రకటించారు. అయితే, మృతుల సంఖ్య 49 అని, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. వంతెన కూలడానికి ముందు సైనికులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలో సైన్యం పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేసింది.కాంగోలో లక్షలాది మందికి అశాస్త్రీయ గనుల తవ్వకమే జీవనాధారం. అయితే, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. సొరంగాలు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో ప్రతి ఏటా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa