దండకారణ్య అడవుల్లో ఒక పేరు వినగానే కేంద్ర బలగాల గుండెల్లో గడ్డకట్టేది – హిడ్మా. ఈ యువ మావోయిస్ట్ నేత గెరిల్లా యుద్ధ వ్యూహకర్తగా పేరు గడించాడు. అతని మెరుపు దాడులు, ఎప్పటికప్పుడు మారే రూట్లు, ఇన్ఫర్మర్ల నెట్వర్క్తో కలిపి అతన్ని పట్టుబడని శత్రువుగా మార్చాయి. చిన్న వయసులోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ఫస్ట్ బెటాలియన్కు కమాండర్గా ఎదిగి, పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నాడు.
2010 ఏప్రిల్ 6న చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో జరిగిన తాడ్మెట్ల దాడి హిడ్మా పేరును దేశవ్యాప్తంగా గుర్తింపబడేలా చేసింది. ఆ ఉదయం CRPF 62వ బెటాలియన్కు చెందిన 76 మంది జవాన్లు ఒక్కసారిగా మట్టికరిచారు. హిడ్మా బృందం రోడ్డు పక్కనే పొంచి ఉండి, ల్యాండ్మైన్స్, ఏకే-47లతో చేసిన ఈ దాడి భారత భద్రతా దళాల చరిత్రలో అతి పెద్ద నష్టంగా నిలిచిపోయింది.
మూడేళ్ల తర్వాత 2013 మే 25న జీరం ఘాటీలో మరో ఘోర దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు నందకుమార్ పటేల్, వీసీ షుక్లా, మహేంద్ర కర్మతో సహా 27 మంది ఒక్కసారిగా పొటనపడ్డారు. ఈ దాడికి కూడా హిడ్మా ప్లాన్ రూపొందించినట్టు భద్రతా వర్గాలు గుర్తించాయి. రాజకీయ నాయకులపై ఇలాంటి దాడి చత్తీస్గఢ్ రాజకీయాలను కుదిపేసింది.
తాజాగా 2021 ఏప్రిల్ 3న సుక్మా-బీజాపూర్ సరిహద్దులో జరిగిన భయానక ఎన్కౌంటర్లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ తుపాకి పోరులో హిడ్మా నేతృత్వంలోని PLGA బలగాలు పూర్తి ఆధిపత్యం చూపాయి. ఈ దాడి తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హిడ్మా తలపై రూ. 1 కోటి బహుమతి ప్రకటించినా, ఇప్పటివరకు అతన్ని పట్టుకోలేకపోవడం భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మిగిలింది. దండకారణ్యంలో హిడ్మా ఇప్పటికీ నీడలాగా తిరుగుతూ, కేంద్ర బలగాలకు నిద్రలేకుండా చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa