ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, గమ్యానికి వేగంగా చేర్చేందుకు రైల్వే నిరంతరం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శతాబ్ది, రాజధాని, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను ప్రారంభించింది. ఇక, హైస్పీడ్ రైళ్లను పట్టాలను ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే బుల్లెట్ రైలు కల భారత్లో సాకారం కాబోతోంది. అహ్మదాబాద్- ముంబయి మధ్య బుల్లెట్ రైలు కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి బుల్లెట్ రైలు 2026లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు దేశంలోని ముఖ్యమైన నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
దక్షిణాదిన చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాదివాసులకు బుల్లెట్ రైలు కల సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా చెన్నై- హైదరాబాద్ బుల్లెట్ మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో చేర్చేందుకు తుది అలైన్మెంట్ను తమిళనాడు ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే సమర్పించింది.
ఈ కారిడార్కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై తమిళనాడు ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం నెలలోపు ఖరారు చేస్తామని చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి జయకుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ప్రణాళికలో రూపొందించిన గూడూరు స్థానంలో తిరుపతికి రైలు వెళ్లేలా మార్పులు చేశామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్- చెన్నై మధ్య ప్రయాణ 'సమయం 12 గంటల పడుతోంది. తాజాగా డిజైన్ చేసిన మార్గం వల్ల ఏకంగా 2.20 గంటల మేర తగ్గనుంది. అంతేకాదు, కొత్త రూట్లో చెన్నై సెంట్రల్, చెన్నై రింగురోడ్డు స్టేషన్లు ఉంటాయి. వాణిజ్య, మొబిలిటీ హబ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా రవాణా ఆధారిత అభివృద్ధికి ప్రతిస్టేషన్ చుట్టూ దాదాపు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
దక్షిణ మధ్య రైల్వే అలైన్మెంట్, త్వరగా స్థలాలు ఖరారు చేయాలని, భూ సేకరణకు సూత్రప్రాయ ఆమోదం పొందాలని, దీర్ఘకాలిక మౌలిక సౌకర్యాల మాస్టర్ ప్లాన్లో రైలు కారిడార్ను కూడా చేర్చాలని రవాణాశాఖకు ఇటీవల రాసిన లేఖలో కోరింది. హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో 12 కి.మీ వరకు సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంది. దీనికి అవసరమైన భూ సమీకరణలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర అధికారులతో కలిసి ఉమ్మడిగా క్షేత్రస్థాయి సందర్శనలకు రెండు రైల్వే జోన్లు అభ్యర్థించాయి. కాగా, ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాలను కలిపేలా బుల్లెట్ రైలుకు సర్వే జరుగుతోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa