మీరట్లో ప్రేమించి పెళ్లాడిన భర్తను చంపి.. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టి సీల్ చేసిన ముస్కాన్ రస్తోగికి ఇటీవలే బిడ్డ పుట్టింది. ఆమె భర్త సౌరభ్ రాజ్పుత్ పుట్టిన రోజు అయిన నవంబర్ 24వ తేదీనే చిన్నారి కూడా పుట్టడం గమనార్హం కాగా.. ముస్కాన్ తాజాగా తన బిడ్డకు రాధ అని పేరు పెట్టుకుంది. అయితే సౌరభ్ కుటుంబ సభ్యులు.. ఈ చిన్నారికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారి తీసింది.
రాధకు జైల్లోనే జన్మనిచ్చిన ముస్కాన్
లాజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చిన్నారి జన్మించిందని.. ముస్కాన్ను బుధవారం తిరిగి జిల్లా జైలుకు పంపనున్నామని ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ షగున్ తెలిపారు. శిశువుకు ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె తల్లితో పాటు మహిళల బ్యారక్లో ఉండే అవకాశం ఉందని జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. జైలు అధికారులు నవజాత శిశువుకు దుస్తులు, పోషకాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తారు. ముస్కాన్ ముందుగా అబ్బాయి పుడితే 'కృష్ణ' అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
మరోవైపు చనిపోయిన సౌరభ్ రాజ్పుత్ సోదరుడు రాహుల్.. ఈ నవజాత శిశువుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కోరుతూ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ముస్కాన్, సౌరభ్లకు ఉన్న పెద్ద కూతురుకు కూడా డీఎన్ఏ పరీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సౌరభ్కు.. ఆ ఇద్దరు పిల్లలకు జీవ సంబంధం ఉందని నిరూపితమైతేనే రాజ్పుత్ కుటుంబం వారి బాధ్యత తీసుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. లేదంటే ముస్కాన్, ఈ నవజాత శిశువుతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా ముస్కాన్ అత్యంత తెలివైనదని.. పిల్లల భద్రతకు కూడా ముప్పు కలిగించే అవకాశం ఉందని రాహుల్ ఆరోపించారు. సౌరభ్ తల్లి రేణు రాజ్పుత్ కూడా ఈ డిమాండ్ను సమర్థించారు.
సౌరభ్ పుట్టినరోజే డెలివరీ..
ముస్కాన్ ఉద్దేశపూర్వకంగా సౌరభ్ పుట్టినరోజునే ప్రసవం అయ్యేలా ప్రణాళిక వేసుకుందని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని ఆసుపత్రి అధికారులు ఖండించారు. ప్రసవ తేదీ కేవలం అంచనా మాత్రమేనని, ప్రసవ సమయం సహజంగా వచ్చిందని.. దానిని ఎవరూ ప్రణాళిక చేయలేరని డాక్టర్ షగున్ వివరించారు.
సౌరభ్ రాజ్పుత్ను ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి 2025.. మార్చి 4న రాత్రి మీరట్లోని ఇందిరా నగర్లోని వారి ఇంట్లోనే హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్కు మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఆ శరీర భాగాలను సిమెంట్ నింపిన నీలం రంగు డ్రమ్లో పెట్టి దాచారు. ఈ జంట హత్య తర్వాత హిమాచల్ ప్రదేశ్కు పారిపోయినట్లు విచారణలో తేలింది. సాహిల్ శుక్లాతో తన సంబంధానికి అడ్డుగా ఉన్నందునే ముస్కాన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa