ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇంద్రజాల్ రేంజర్‌'తో సరిహద్దుల్లో డ్రోన్లకు చెక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 08:00 PM

చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో.. సరిహద్దు రక్షణ విషయంలో భారత్ ఒక కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ అయిన ' ఇంద్రజాల్ రేంజర్ 'ను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ లాంఛ్ చేసింది. సరిహద్దుల్లో పదే పదే శత్రు దేశాల డ్రోన్లు చొరబాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రోన్ ముప్పును ఎదుర్కోవడంలో ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుంది.


గాల్లోనే శత్రు డ్రోన్లను వేటాడే సామర్థ్యం


సాధారణంగా యాంటీ డ్రోన్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు పనిచేస్తాయి. కానీ ఈ ఇంద్రజాల్ రేంజర్ మాత్రం పూర్తిగా భిన్నం. పూర్తిగా మొబైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం కలిగి ఉండటంతో.. సరిహద్దుల్లో చురుగ్గా గస్తీ కాస్తున్నప్పుడే.. శత్రువుల డ్రోన్లను గుర్తించి.. వాటిని ట్రాక్ చేసి.. క్షణాల్లో వాటిని నిలిపివేస్తుంది.


సరిహద్దులకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధిత ఆయుధాల స్మగ్లింగ్ పెరగడంతోపాటు.. భారత్‌లోని రూ.3 లక్షల కోట్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ డ్రోన్‌లు ప్రధాన వాహనాలుగా పనిచేస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన భద్రతా సవాళ్ల కారణంగానే వేగవంతమైన, మొబైల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అవసరం భారత్‌కు ఏర్పడింది.


సరిహద్దుల్లో అడ్డుకునే ప్రతీ ఒక్క డ్రోన్ కారణంగా.. రక్షించే ప్రాణాలు, భారతదేశ అంతర్గత భద్రత బలపడడానికి సంకేతమని.. ఇంద్రజాల్ సంస్థ ఫౌండర్, సీఈఓ కిరణ్ రాజు వెల్లడించారు. దేశ ప్రజలకు ఉన్న స్వేచ్ఛను రక్షించడమే ఇంద్రజాల్ ప్రాథమిక లక్ష్యమని తేల్చి చెప్పారు. ఈ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్.. సరిహద్దుల్లోని రోడ్లు, కాలువలు, వ్యవసాయ భూములు, కీలక ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలు సహా సున్నితమైన ప్రదేశాల్లో 24 గంటల పాటు కవరేజీని అందిస్తుంది. ఈ ఇంద్రజాల్ రేంజర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. శత్రు డ్రోన్ల ముప్పును ఆటోమేటిక్‌గా అంచనా వేసి.. టార్గెట్లను వెంటనే అడ్డగిస్తుంది.


ఈ ఇంద్రజాల్ రేంజర్ టెక్నాలజీ.. మన పిల్లలు, రైతులు, భవిష్యత్తును రక్షించే కవచమని.. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ప్రశంసలు కురిపించారు. ఇంద్రజాల్ రేంజర్‌కు ఉన్న అధునాతన అటానమీ ఇంజిన్.. స్కైఓఎస్ (SkyOS), మల్టిపుల్ సెన్సార్ ఇంటెలిజెన్స్‌ను ఒకే ఫ్రేమ్‌వర్క్‌లో విలీనం చేసి.. ఎయిర్‌పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, సైనిక స్థావరాల వంటి కీలక ప్రాంతాలను రక్షించడానికి సెక్యూరిటీ డోమ్స్‌ను సృష్టించగలదని పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు లాజిస్టికల్ సరఫరా మార్గాలను, ఆర్థిక మార్గాలను అడ్డుకోవడం ద్వారా.. ఈ కొత్త ఇంద్రజాల్ రేంజర్ సరిహద్దు్ల్లోని నేర కార్యకలాపాలను, నియామకాలను అడ్డుకుంటుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa