ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాసేపు ఆగండి.. నేనే మీకు ఫోన్ చేస్తాను': డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ మెసేజ్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 08:39 PM

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న 'కోల్డ్ వార్' కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈక్రమంలోనే రాహుల్ గాంధీ.. డీకే శివ కుమార్‌కు పంపిన ఓ సంక్షిప్త వాట్సాప్ సందేశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


రాహుల్ సందేశం.. డీకే ప్రయత్నాలు


రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో.. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై రాహుల్‌తో చర్చించేందుకు డీకే శివకుమార్ పలుమార్లు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రయత్నాలకు సమాధానంగా.. రాహుల్ కేవలం "వేచి ఉండండి. నేనే మీకు కాల్ చేస్తా" అని డీకేకు వాట్సాప్‌లో బదులిచ్చినట్లు సమాచారం. ఈ సంక్షిప్త సందేశం ద్వారా రాహుల్.. పరిస్థితిని సమీక్షించేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ ఈ వివాదంపై అధిష్ఠానంతో నేరుగా చర్చించేందుకు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనకు గల కారణాలు అధికారికంగా తెలియకపోయినా.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ.. డీకే శివకుమార్ మంగళవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్న పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళితో రహస్య ప్రాంతంలో సమావేశం అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగిందని, అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయని డీకే మద్దతుదారులు పేర్కొన్నారు. ఈ రహస్య సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


కర్ణాటకలో కొనసాగుతున్న నాయకత్వ మార్పు ప్రచారానికి డిసెంబర్ 1 లోపే కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు మీడియాకు తెలిపారు. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున.. అంతకుముందే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిద్ధరామయ్య శిబిరం మార్చి వరకు యథాస్థితిని కొనసాగించాలని, మంత్రివర్గ విస్తరణ చేయాలని పట్టుబడుతుండగా.. డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం నాయకత్వ బాధ్యతలు డీకేకు అప్పగించాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa