కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీలో ఎలాంటి అస్థిరత కనిపించకుండా నివారించడానికి.. డిసెంబర్ 1వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే కర్ణాటక సీఎం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఇవాళ లేదా రేపు రాహుల్ గాంధీతో సమావేశమై కర్ణాటక పరిస్థితిపై చర్చించనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను ఈనెల 28వ తేదీ లేదా 29వ తేదీల్లో ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది. సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించాలని.. ఆయన వర్గం కొనసాగించాలని కోరుతుండగా.. డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం ఆయనను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న ఈ అంతర్గత పోరుపై నాయకులు బహిరంగ ప్రకటనలు చేయడంపై మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ అంతర్గత ప్రశ్నలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ఢిల్లీకి పిలవనుంది. గత కొన్ని నెలలుగా కర్ణాటకలో సాగుతున్న ఈ ఆధిపత్య పోరుపై ఇరువురు నేతలు బహిరంగ ప్రకటనలు చేయడంపై మల్లిఖార్జున ఖర్గే ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను కనీసం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది. అదే సమయంలో కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధరామయ్య మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అయితే 2023లో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో జరిగిన అనధికారిక ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్ల తర్వాత బదిలీ చేయాలనే స్పష్టమైన ప్రణాళికను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించాలని డీకే శివకుమార్ మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రామనాగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వంటి డీకే శివకుమార్ మద్దతుదారులు బహిరంగంగానే ఆయన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ అనిశ్చితిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వకపోతే.. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ అధికారం కలిగిన రాష్ట్రమైన కర్ణాటకలో అస్థిరత ఉందనే భావన దేశ ప్రజల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భయపడుతోంది. దీనిపై తుది నిర్ణయం రాహుల్ గాంధీదే అయినప్పటికీ.. సిద్ధరామయ్య వైపే ఎమ్మెల్యేల మద్దతు ఉందనే ధీమాతో ఆయన వర్గం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ కర్ణాటక బుల్లెట్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా అనేదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa