చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై అనాథ ఆశ్రమంలో ఉంటున్న ఆ యువతిని అమెరికా దంపతులు అక్కున చేర్చుకున్నారు. దత్తత తీసుకుని వారి వెంట అమెరికా తీసుకెళ్లారు. పెంచి, పెద్ద చేశారు. అలాంటి వారి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉండాల్సిన సదరు యువతి.. పెంచిన విశ్వాసాన్ని మర్చిపోయి.. వారిపై తప్పుడు ఆరోపణలు చేసింది. తనను కొట్టి, హింసిస్తున్నారని పేర్కొంది. మతం మార్చుకోమని బలవంతం చేస్తున్నారని.. తనను కాపాడమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వాలు ఆ యువతిని అమెరికా నుంచి ఇండియా రప్పించాయి. ఇక్కడకు వచ్చాక సదరు యువతి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది. తాను అమెరికా తల్లిదండ్రుల మీద చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధమని.. తన ప్రియుడిని కలిసేందుకు ఇండియా రావడం కోసమే ఇలా తప్పుడు ఆరోపణలు చేశానని చెప్పి అందరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దీంతో సదరు యువతి మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..
తనను దత్తత తీసుకున్న అమెరికా తల్లి వేధింపులకు గురిచేసిందంటూ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ఒడిశా యువతి పూజ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఒడిశా వచ్చేందుకే తాను అమెరికా తల్లి మీద అబద్ధపు ఆరోణలు చేశానని వెల్లడించింది. పైగా తాను బాలాసోర్కు చెందిన ఓ యువకుడిని ప్రేమించానని.. అతడి కోసం ఒడిశా రావాలని భావించి.. తన దత్తత తల్లి మీద అబద్ధాలు చెప్పానని తెలిపింది.
కొన్ని రోజుల క్రితం పూజ సోషల్ మీడియాలో దత్తత తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారు కాపాడమని ఒడిశా సీఎంను కోరుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. అది చూసిన అధికారులు వెంటనే స్పందిస్తూ.. కేంద్ర సహకారంతో ఆమెను ఇండియాకు తీసుకువచ్చారు. ఈక్రమంలో ఒడిశాలోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగిన తర్వాత పూజ మీడియాతో మాట్లాడుతూ.. దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది.
‘‘ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినవన్నీ అబద్ధాలు. దత్తత తీసుకున్న అమ్మ నన్ను ఎప్పుడూ కూడా వేధించలేదు. మతం మార్చుకోమని వారు నన్ను బలవంతం చేయలేదు. నా దత్తత తల్లి చాలా మంచిది. ఒడిశాకు తిరిగి వచ్చేందుకే నేను వారి మీద అబద్ధాలు చెప్పాను. నేను చేసిన ఆరోపణల వల్ల నా దత్తత తల్లి చాలా ఇబ్బందుల్లో పడ్డారు’’ అని పూజ అలియాస్ సెజెల్ వెల్లడించింది.
ఎవరీ పూజ..
రైలు ప్రయాణంలో తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయిన పూజ అలియాస్ సెజెల్ను చైల్డ్లైన్ సిబ్బంది కాపాడి.. నీలగిరి బాలికల కేంద్రానికి చేర్చారు. ఆ తర్వాత ఆమెను భువనేశ్వర్లోని మరో చిన్నారుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అక్కడే ఉండి చదువుకుంటున్న పూజను 2018లో అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. గత ఏడేళ్లుగా పూజ అమెరికాలోనే ఉంటుంది. ఇదిలా ఉండగా 2023లో పూజ పాస్పోర్ట్ కాలపరిమితి ముగిసింది. కానీ తనను దత్తత తీసుకున్న వారు ఆమె పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించలేదు.
ఈక్రమంలో పూజ వారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝి తనను ఆదుకోవాలని కోరుతూ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాంగశాఖ సాయంతో ఆమెను ఒడిశాకు తీసుకురాగలిగారు. తీరా ఇండియా వచ్చాక ఆమె అసలు విషయం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
ప్రేమించిన యువకుడి కోసం..
పూజ బాలాసోర్కు చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతడిని కలవడం కోసమే ఒడిశాకు రావాలనుకుంది. దీని గురించి తన దత్తత తల్లికి చెప్పిందని.. కానీ ఆమె అందుకు అంగీకరించక.. పూజతో మాట్లాడటం మానేసిందని సమాచారం. దీంతో పూజ తన అమెరికా తల్లి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించి.. ఆమెను ఇండియాకు రప్పించాయి.
ఇక్కడకు వచ్చాక పూజ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో ఉండటం తనకు ఇష్టం లేదని, ప్రేమించిన యువకుడితోనే కలిసి జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. పూజ నీలిగిరి స్కూల్లో ఆ యువకుడితో కలిసి చదువుకుందని.. తాజాగా రెండేళ్ల క్రితం వీరిద్దరూ మళ్లీ సోషల్ మీడియాలో కలుసుకున్నారని.. అతడి కోసం దత్తత తల్లి మీద ఆరోపణలు చేశానని అంగీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa