ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిసికిన గోధుమ పిండిని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచుకోవచ్చు

Recipes |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 11:22 PM

మన ఇళ్లల్లో చాలా మంది ఒక్కపూటైనా చపాతీలు చేసుకుని తింటారు. అయితే, గోధుమ పిండిని ఎక్కువ పిసికి కలుపుకుంటారు. కొన్ని చపాతీలు చేసుకుని.. మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన పిండితో చపాతీలు చేసుకుని తింటారు. అయితే, ఇది సరైనదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఫ్రిజ్‌లో ఉంచిన పిండి చూడటానికి బాగానే కనిపించవచ్చు. కానీ దాని లోపల అనేక మార్పులు సంభవిస్తాయని ఆయన వివరించారు.


అంతేకాకుండా అలాంటి పిండితో చేసుకుని చపాతీలు తినడం వల్ల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందని చెప్పారు. ఆయన ప్రకారం మిగిలిన గోధుమ పిండిని ఫ్రిజ్‌లో ఎంత సేపు కంటే ఎక్కువ ఉంచకూడదు? రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ సేపు ఉంచిన పిండితో చపాతీలు చేసుకుని తింటే ఏమవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.


పిండిని ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది?


కిణ్వ ప్రక్రియ ఆగదు, నెమ్మదిస్తుంది


ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా ప్రకారం.. చాలా మంది పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అది చెడిపోకుండా ఉంటుందని అనుకుంటారు. అయితే, నిజం ఏంటంటే ఫ్రిజ్‌లో ఉన్న చల్లని ఉష్ణోగ్రతలు ప్రక్రియను నెమ్మదిస్తాయి. అయితే పిండిని చెడిపోకుండా ఆపవు. పిండిలోని ఈస్ట్, బ్యాక్టీరియా నెమ్మదిగా పనిచేస్తూ, CO₂తో పాటు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది రుచి, వాసనను ప్రభావితం చేస్తుంది. రెండు రోజుల తర్వాత, పిండి కొద్దిగా పుల్లగా మారడం, ఆకృతిలో మార్పుల్ని మనం గమనించవచ్చు.


గ్యాస్, ఉబ్బరం సమస్య పెరగవచ్చు


కిణ్వ ప్రక్రియ పెరిగే కొద్దీ పిండిలోని గ్లూటెన్ బలహీనపడుతుంది. దీని అర్థం చపాతీ అంత మెత్తగా, మృదువుగా ఉండదు. ఇలాంటి చపాతీలు తినడం వల్ల కడుపులో భారంగా అనిపిస్తుంది. అంతేకాకుండా వీటిని నమలడం కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి చపాతీలు లేదా రొట్టెలు జీర్ణం కావాడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొంతమందికి గ్యాస్, కడుపులో భారం, ఎసిడిటీ అనిపించవచ్చు.


ఫిట్‌నెస్ కోచ్ ఏం చెప్పారంటే


పోషకాలు తగ్గడం ప్రారంభమవుతాయి


ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పిండి క్రమంగా దాని నాణ్యతను కోల్పోతుంది. కిణ్వ ప్రక్రియ విటమిన్లు, ఖనిజాల్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీని అర్థం చపాతీ కడుపు నింపవచ్చు. కానీ అది తాజా పిండిలాగా అదే పోషకాలను అందించదు. అందుకే మిగిలిన పిండిని ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయకూడదు.


రక్తంలో షుగర్ లెవల్స్‌పై ప్రభావం


ఎక్కువ సేపు ఉంచడం వల్ల పిండిలోని స్టార్చ్ వేగంగా విచ్చిన్నమవుతుంది. ఈ పిండితో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు నిల్వ చేసిన పిండితో చపాతీలు తినకుండా ఉండాలి. తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు కూడా నిల్వ చేసిన పిండితో తయారు చేసిన చపాతీల్ని తినకుండా ఉండాలని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.


పిండిని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచితే మంచిది?


ఫిట్‌నెస్ కోచ్ ప్రకారం తాజా పిండి అంటే అప్పటికప్పుడు పిసికింది చపాతీలు చేసుకోవడానికి బెస్ట్. మీకు అవసరమైనంత పిండిని మాత్రమే పిసికి కలుపుకోవడానికి ప్రయత్నించండి. మీరు దానిని నిల్వ చేయాలనుకుంటే 24 గంటల కంటే ఎక్కువ సేపు ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల చపాతీలు మృదువుగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. గోధుమ పిండిని ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల దాని రుచి, పోషకాలు, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ తాజా పిండిని పిసికి 24 గంటల్లోపు ఉపయోగించడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa