ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గాల్లో తిరగకుండా, పరదాలు కట్టుకొని తిరగకుండా భూమి మీద తిరిగి రైతుల వద్దకు వస్తే రైతుల బాధలు అర్థమవుతాయని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు.కల్లబొల్లి మాటలతో రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. బుక్కరాయసముద్రం, సింగనమల, నార్పల, పుట్టూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో అరటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు గుండెకోతకు గురవుతున్నారని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లి, చేదళ్ల గ్రామాల్లో వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలసి అరటి తోటలను మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ…అరటి పంట వేసిన రైతులకు కొనుగోలుదారులే లేరు… పండ్లను గొర్రెలకు ఇస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిందన్నారు. గ్రామ సచివాలయాల్లో కూర్చోకుండా, రైతు తోటల్లోకి వచ్చి రైతు బాధను కళ్లారా చూస్తే పరిస్థితి అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.గిట్టుబాటు ధర లేని అరటి పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట పండించిన రైతులకు దలారుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు “ఏడున్నర వేలకే కొనుగోలు చేస్తాం” అని చెప్పారని, “మేమే పండిన పంటను అందిస్తాం… ఆ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇవ్వండి” అని విన్నవించారు.గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న రోడ్ల మీద పడేసే దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రైతు ఆనందంగా లేడనే దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.“ఢిల్లీ వాళ్లతో మాట్లాడాం… అక్కడ మాట్లాడాం…” అంటూ మాటలు కాకుండా, చేతలతో చేసి రైతుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులపై భారం మోపకుండా, ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి ఢిల్లీ మార్కెట్లో అమ్మకాలు జరిపి రైతులకు లాభం చేకూర్చారని… వారిని చూసి కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa