ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 01:41 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో అన్నాచెల్లెలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ గాయపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బూట్ల దుకాణంలో శనివారం సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. బూట్ల దుకాణంలో మొదలైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులను భవన యజమాని సతేందర్ అలియాస్ జిమ్మీ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన మమత (40) అనే మహిళ 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంటలకు గల కారణాలను నిర్ధారించేందుకు క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa