ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేచోట రైలు, మెట్రో, బస్, బుల్లెట్ రైలు సేవలు,,,భారత్‌లోనే తొలి 16 అంతస్తుల రైల్వే స్టేషన్‌

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 08:36 PM

బుల్లెట్ రైలు పరుగుల కోసం భారత్ ఎంతో ఎదురుచూస్తోంది. మన దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గమైన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్.. ప్రస్తుతం పూర్తి అయ్యే దశలో ఉంది. వచ్చే ఏడాదిలో భారత్‌లో బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఘనమైన భారతదేశ రైల్వే చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో.. ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


జపాన్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న 508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్‌కు ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఇది పశ్చిమ రైల్వే ప్లాట్‌ఫారాలు 10, 11, 12 పైన నిర్మితమై.. నేరుగా కాలుపూర్ మెట్రో స్టేషన్‌కు అనుసంధానించనున్నారు. ఇక ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ భవనం కేవలం ఎత్తుకే కాదు.. దాని రూపకల్పనకు కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది. స్టేషన్ పైకప్పు వందలాది గాలిపటాలను పోలి ఉండేలా నిర్మిస్తున్నారు. అలాగే ఆ రైల్వే స్టేషన్ ముందుభాగం అహ్మదాబాద్ చారిత్రక సిదీ సయ్యద్ జాలీ క్లిష్టమైన లాటిస్ వర్క్ స్ఫూర్తితో తీర్చిదిద్దుతున్నారు.


 మల్టీ మోడల్ రవాణా కేంద్రం


ఈ 16 అంతస్తుల అహ్మదాబాదా రైల్వే స్టేషన్ నిర్మాణం ఒకే కేంద్రం నుంచి అనేక రకాల రవాణా సౌకర్యాలను అందిస్తుంది. అంటే రైలు, బస్సు, మెట్రో, బుల్లెట్ రైళ్లు మొత్తం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ఈ హబ్‌లో బుల్లెట్ రైలు, మెట్రో, రైల్ సేవలు, బస్సు రవాణా సేవలను ఒకే చోట అనుసంధానించడం ద్వారా.. ప్రయాణికులు రాకపోకలు సాగించడం మరింత సులభతరం, వేగవంతం అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు, కార్పొరేట్ కార్యాలయాలు, షాపులు, మాల్స్ వంటి కమర్షియల్‌ కేంద్రంగా నిలవనుంది. అదే సమయంలో ప్రయాణికుల కోసం అత్యంత సౌకర్యవంతమైన లాంజ్‌లు, ఆధునిక ట్రాన్సిట్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.


రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ 2027 జూలై నాటికి పూర్తి అవుతుంది. భవిష్యత్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పూర్తి అయిన తర్వాత.. ఇద స్థానిక వ్యాపారం, పర్యాటకం, మొత్తం ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు.. జపాన్‌కు చెందిన అధునాతన ఈ5 సిరీస్ (షింకన్‌సెన్) టెక్నాలజీని ఉపయోగించి గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa