ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రామా అంటే అది.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా గాంధీ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 08:44 PM

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే.. ప్రతిపక్షాలను ఉద్దేశించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చట్టసభల్లో డ్రామాలు వద్దని.. టిప్స్ ఇస్తానంటూ.. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా.. కౌంటర్ ఇచ్చారు. బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమిని గుర్తు చేసిన ప్రధాని.. పార్లమెంటును గందరగోళం చేయవద్దని సూచించారు. పార్లమెంటులో నాటకాలు వద్దని.. ఫలితం ఉండాలని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలకు స్పందించిన ప్రియాంకా గాంధీ.. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించడమే పార్లమెంట్ పని అని.. దాన్ని నాటకం అనడం సరికాదని విమర్శించారు.


దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా ఉన్న చాలా పెద్ద సమస్యలు అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఈ సమస్యల గురించి చర్చిద్దామని పేర్కొన్నారు. పార్లమెంటు దేనికి ఉందని.. ప్రశ్నించారు. ఇది డ్రామా కాదని.. ముఖ్యమైన అంశాలను లేవనెత్తి మాట్లాడటం నాటకం కాదని తేల్చి చెప్పారు.


ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించేందుకు అనుమతి ఇవ్వకపోవడమే నాటకమని ప్రియాంకా గాంధీ మీడియాతో తెలిపారు. ఇక ప్రధాని మోదీ చేసిన విమర్శలపై వ్యాఖ్యానించడానికి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు.


పార్లమెంట్ సమావేశాల ముందు ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయడం.. మరీ ముఖ్యంగా మహిళలు పాల్గొనడం ఆశను, నమ్మకాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని భారత్ నిరూపించిందని.. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ ఓటమి నిరాశను జీర్ణించుకోలేక పార్లమెంటును గందరగోళ స్థలంగా మార్చడానికి ప్రయత్నించకూడదని హితవు పలికారు.


నాటకాలు ఆడటానికి చాలా స్థలాలు ఉన్నాయని.. నాటకాలు ఆడాలనుకునే వారు అక్కడ చేయవచ్చని ప్రధాని మోదీ.. ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. పార్లమెంటులో డ్రామాలు వద్దని.. ఫలితం ఉండాలని ఆశించారు. విమర్శలు, ప్రతికూలతలను కంట్రోల్‌లో ఉంచి.. దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షాల పాలనతో ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని.. అందుకే ఆ కోపమంతా పార్లమెంటుపైకి వస్తుందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు పనిచేయవని ప్రతిపక్షాలు గ్రహించాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎలా పనిచేయాలో తాను సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa