ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాను అస్థిరపరిచేందుకు షేక్ హసీనా కుట్ర.. 2009లో తిరుగుబాటుకు ఆదేశమిచ్చింది ఆమెనే

international |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 09:01 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశంలో సంచలన ఆరోపణలు వచ్చాయి. 16 ఏళ్ల క్రితం జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు వెనుక హసీనానే ఉన్నట్లు.. ఆ తిరుగుబాటుపై దర్యాప్తు చేసిన కమిషన్ తాజాగా తన నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా బంగ్లా ఆర్మీని బలహీనపర్చే ప్రయత్నంలో.. తిరుగుబాటు సమయంలో భారత్‌ కూడా అస్థిరతను సృష్టించేందుకు యత్నించిందని కమిషన్ ఆరోపించడం గమనార్హం.


గతేడాది విద్యార్థుల ఆందోళనల కారణంగా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంటున్న హసీనాపై కమిషన్ ఈ తీవ్ర ఆరోపణలు చేసింది. షేక్ హసీనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2009లో జరిగిన రెండు రోజుల తిరుగుబాటులో అగ్ర సైనిక అధికారులతో సహా మొత్తం 74 మంది మరణించారు. ఈ తిరుగుబాటుకు హసీనానే స్వయంగా ఆదేశాలు ఇచ్చారని విచారణలో తేలినట్లు కమిషన్ పేర్కొంది. అప్పటి ఆవామీ లీగ్ ప్రభుత్వ నేతలు కూడా ఈ తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు మాజీ ఎంపీ ఫజ్లే నూర్ తపోష్ దీనిని ముందుండి నడిపించినట్లు నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో జరిగిన హత్యలకు హసీనానే ప్రధాన కారకులని ఆరోపించింది.


ఈ ఆరోపణలతో పాటు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే హసీనాకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తిరుగుబాటు సమయంలో షేక్ హసీనాకు భారత్ మద్దతుగా నిలిచిందని, బంగ్లాదేశ్‌లో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించిందని కమిషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సమయంలో 921 మంది భారతీయులు ఢాకాకు వచ్చారని.. వారిలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియరాలేదని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ ఆరోపణలపై భారత్ ఇంకా స్పందించలేదు.


గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి ఢిల్లీకి వచ్చిన హసీనాను పలు కేసుల్లో దోషిగా ఉన్నందున తిరిగి అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను పలుమార్లు కోరింది. ఈ విషయాన్ని భారత్ అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ షేక్ హసీనా అప్పగింతపై స్పందించలేదు. అప్పగిస్తామని కానీ, అప్పగించం అని కానీ బంగ్లా అధికారులకు క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలోనే కమిషన్ ఇచ్చిన నివేదిక.. ఇరు దేశాల మధ్య కొత్త రగడకు దారితీసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa