ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఆర్మీ చీఫ్‌కు అపరిమిత అధికారాలు,,,,అసిమ్ మునీర్ చేతిలో పాకిస్తాన్ అణ్వాయుధాలు

international |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 08:48 PM

పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. కొత్తగా సృష్టించిన, అత్యంత శక్తివంతమైన సైనిక పదవి అయిన పాకిస్తాన్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ (సీడీఎఫ్)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను నియమించింది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను ఐదేళ్ల కాలానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)గా ఏకకాలంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా నియమిస్తూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ సీడీఎఫ్ పదవి పాక్ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌పై అధికారాన్ని కల్పిస్తుంది.


అదే సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్‌పై కూడా అసిమ్ మునీర్ ‌కు పర్యవేక్షణ అధికారాన్ని కల్పిస్తుంది. దీంతో ఆ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక అధిపతిగా అసిమ్ మునీర్ మారిపోయారు. ఇక ఈ సీడీఎఫ్‌కు పాకిస్తాన్ అధ్యక్షుడితో సమానంగా జీవితకాలం చట్టపరమైన విచారణల నుంచి మినహాయింపు లభిస్తుంది. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీడీఎఫ్ పదవిని గత నెలలోనే ఏర్పాటు చేశారు. గతంలో రద్దు చేసిన ఛైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ స్థానంలో ఈ సీడీఎఫ్‌ను పాక్ ప్రభుత్వం తీసుకువచ్చింది.


ఈ సీడీఎఫ్ పదవి ద్వారా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ మొత్తం 3 సేవలు అసిమ్ మునీర్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ పదవి.. దశాబ్దాల్లో పాకిస్తాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అసిమ్ మునీర్‌ను మార్చేసింది. ఈ సీడీఎఫ్.. అసిమ్ మునీర్‌కు నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్‌పై పర్యవేక్షణను కల్పిస్తుంది. దాని వల్ల దేశ అణు ఆయుధాలు, మిసైల్ సిస్టమ్‌లను కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటారు.


ఇక పాకిస్తాన్ దేశ చరిత్రలో ఐదు-నక్షత్రాల ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాతోపాటు.. సీఓఏఎస్, సీడీఎఫ్ సంయుక్త కమాండ్‌ను ఒకే సమయంలో నిర్వహించిన మొట్టమొదటి సైనిక అధికారిగా అసిమ్ మునీర్ చరిత్రలోకి ఎక్కారు. 1965 యుద్ధ సమయంలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఈ ఫీల్డ్ మార్షల్ బిరుదును పొందిన రెండో ఆర్మీ అధికారి కూడా ఈ అసిమ్ మునీర్ కావడం గమనార్హం.


చట్టపరమైన రక్షణ, పర్యవేక్షణ తగ్గింపు


ఈ కొత్త సీడీఎఫ్ నియామకం ద్వారా సైనిక అధిపతికి అసాధారణమైన చట్టపరమైన రక్షణ లభిస్తుంది. సీడీఎఫ్ అసిమ్ మునీర్‌కు దేశాధ్యక్షుడితో సమానమైన చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఈ హోదా పొందిన వారికి జీవితకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన విచారణలు ఎదుర్కొకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ సవరణలు త్రివిధ దళాలపై.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే పర్యవేక్షణను కూడా తగ్గిస్తాయి. ఇకపై వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకానికి సీడీఎఫ్ సిఫార్సు చేస్తే.. దాన్ని పాక్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. గతంలో ఈ నియామకాలు చేసే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉండేది.


ఇక పాకిస్తాన్ చరిత్రలో ప్రభుత్వంలో సైన్యం జోక్యం కొత్తేమీ కాదు. 1947లో పాక్ విడిపోయిననప్పటి నుంచి.. పాకిస్తాన్ పౌర, సైనిక పాలన మధ్య అధికారం దోబూచులాడుతూనే ఉంది. 1999లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న పర్వేజ్ ముషారఫ్ చివరి సైనిక పాలకుడు. అప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక రంగాలపై సైన్యం ప్రభావం బలంగా ఉంది. దీన్ని హైబ్రిడ్ పాలన అని రాజకీయ విశ్లేషకులు పిలుస్తారు. అసిమ్ మునీర్‌కు ఇంత అపరిమిత అధికారాన్ని అప్పగించడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మొదట సంకోచించినప్పటికీ.. చివరకు ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa