ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓడితే ఇక అంతే,,,వైజాగ్‌లో భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 11:09 PM

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా, రాయపూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా స్టన్నింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. దాంతో వైజాగ్ వేదికగా జరిగే మూడో వన్డే మరింత ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది సిరీస్ కైవసం చేసుకోనుంది. దాంతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డైగా మారింది.


వైజాగ్ పిచ్‌లో మొదటి రెండు వన్డేల మాదిరిగానే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖలో బ్యాటింగ్‌కు ఎక్కువ అనుకూలంగా ఉండటంతో మళ్లీ 300కు పైగా స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టుకే ఎక్కువ విజయావకాశాలు రానున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో టాస్ ఓడిన కేఎల్ రాహుల్, వైజాగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు


వాతావరణంలో తేమ ప్రభావం పక్కనపెడితే టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయలేక ఇబ్బంది పడుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ మినహా మిగతా ఇద్దరు పేసర్లు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డింగ్ కూడా భారత్ ఓటమికి ఓ కారణంగా కనిపిస్తోంది. టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ వన్డే సిరీస్ కూడా ఓడిపోతే భారీ విమర్శలు మూటగట్టుకునే అవకాశం ఉంది.


మొదటి రెండు వన్డేల్లో టీమిండియా ఆఖర్లో ఊహించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయింది. భారీ స్కోర్ చేసినా ఇంకొన్ని పరుగులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దాంతో రవీంద్ర జడేజాకు ఆఖరి వన్డేలో రెస్ట్ ఇచ్చి తిలక్ వర్మను ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తిలక్ వర్మ లోయర్ ఆర్డర్ బ్యాటర్ కాకపోయినా, అతని హిట్టింగ్ సామర్థ్యంతో డెత్ ఓవర్లలో పరుగులు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రసిద్ కృష్ణ బంతితో అంతగా ప్రభావం చూపకపోయినా, అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో మరో అవకాశం ఇవ్వాల్సిందే. యశస్వి జైస్వాల్ కూడా ఫామ్‌లో లేకపోయినా, బ్యాకప్ ఓపెనర్ లేకపోవడంతో అతడే కొనసాగనున్నాడు.


మూడో వన్డేకి భారత జట్టు అంచనా


యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa