ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో హోప్ సెంచరీ,,,,త్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానంలో

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 11:13 PM

క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ షై హోప్ అద్భుత శతకం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా డగౌట్‌కి పరిమితం కాకుండా సన్‌‌గ్లాసెస్ పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేయడమే కాకుండా సెంచరీతో రాణించాడు. దాంతో నాలుగో రోజే ఆలౌట్ అవుతుంది అనుకున్న విండీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.


న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు 531 పరుగుల లక్ష్యం ఎదురైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. షై హోప్ 116 పరుగులు, జస్టీన్ గ్రీవ్స్ 55 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఈ టెస్టులో విజయం సాధించాలంటే విండీస్‌కు ఆఖరి రోజు 319 పరుగులు కావాల్సి ఉంది. హోప్, గ్రీవ్స్ ఆఖరి రోజు కూడా నిలబడితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.


ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న హోప్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేశాడు. హోప్‌కి కొన్ని రోజులుగా తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ ఉండటంతో మ్యాచ్ మొత్తం యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉపయోగించాడు. దాంతో ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. అయినా మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు. సన్‌గ్లాసెస్‌తో ఆడుతూ కూడా కివీస్ బౌలర్లను ఎదుర్కొని నిలబడటంతో హోప్‌‌ డెడికేషన్‌కు క్రికెట్ లోకం సలాం కొట్టింది.


ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షై హోప్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ 39 ఇన్నింగ్స్‌లలో 1732 పరుగులు చేస్తే, షై హోప్ 46 ఇన్నింగ్స్‌లలో 1677 పరుగులు చేశాడు. కివీస్‌పై రెండో ఇన్నింగ్స్‌లో హోప్ అవుట్ కాలేదు కాబట్టి ఆఖరి రోజు మరో 56 పరుగులు చేస్తే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మొదట ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 167 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 145, రచిన్ రవీంద్ర 176 పరుగులు చేయడంతో 466/8 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన ఆధిక్యంతో కలిపి న్యూజిలాండ్ మొత్తం 530 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 212/4 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa