ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు.. లోక్‌సభలో ఆమోదం

business |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 11:21 PM

దేశంలో పాన్ మసాలాల ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పాన్ మసాలాలపై కొత్త సెస్సు త్వరలోనే అమలులోకి రానుంది. పాన్ మసాలా తయారీ యూనిట్లపై కొత్త సెస్సు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభలో శుక్రవారం ఆమోదం లభించింది. ఈ కొత్త సెస్సు విధించడం ద్వారా వచ్చిన నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపై ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు 2025 తీసుకొచ్చింది. ఈ బిల్లుకు శుక్రవారం ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. అప్పటి నుంచి కొత్త సెస్సు అమలవుతుంది.


హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు 2025 జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త సెస్సు ద్వారా సమకూరిన నిధులను రాష్ట్రాలతోనూ పంచుకుంటామని తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో లోక్‌సభలో బిల్లుకు ఆమోదం తెలిపారు. పాన్ మసాలా సహా ఈ తరహా ఉత్పత్తులను తయారు చేస్తోన్న యూనిట్లకు ఈ సెస్సును విధిస్తారు. జాతీయ ఆరోగ్యం, జాతీయ భద్రత వంటి పనుల కోసం ఈ నిధులను ఉపయోగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


ప్రస్తుతం పాన్ మసాలాపై వస్తు సేవల పన్న గరిష్ఠ శ్లాబు అయిన 40 శాతం విధిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సెస్సు వల్ల జీఎస్టీ రెవెన్యూపై ఏ ప్రభావమూ ఉండదని క్లారిటీ ఇచ్చారు. తయారీ సామర్థ్యం ఆధారంగానే ఈ కొత్త సెస్సును విధిస్తామని ఆమె తెలిపారు. 2010- 2014 మధ్య కాలంలో సెస్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 7 శాతం మేర ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 6.1 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.


పాన్ మసాలా ఉత్పత్తులపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దానిపై ఈ కొత్త సెస్సు అమలులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందనే వాదనలూ ఉన్నాయి. దేశంలో కోట్లాది మంది పాన్ మసాలా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. పన్నులు అధికంగా విధించడం ద్వారా కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు భిన్నంగా జరుగుతోంది. కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరలు పెరిగినా కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa