ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్తు తెలియని మృతదేహానికి సేవలు చేయలేమని పోలీస్ కానిస్టేబుల్స్ చేసిన పనికి అవాక్కవ్వాల్సిందే

national |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:50 PM

ఉత్తరప్రదేశ్‌లో కొందరు పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు, దానిని ఈ-రిక్షాలో తరలించి మరో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దుకాణం ముందు పడేశారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, హోంగార్డును విధుల నుంచి తొలగించారు.వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని శాస్త్రి నగర్ ఎల్-బ్లాక్ క్రాసింగ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1:50 గంటల సమయంలో ఇద్దరు పోలీసులు ఒక ఈ-రిక్షాలో మృతదేహాన్ని తీసుకొచ్చి, ఓ దుకాణం ముందు పడేసి వెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు లోహియా నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ ఘటనపై మీరట్ ఎస్ఎస్‌పీ విపిన్ టాడా విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో నౌచాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్-బ్లాక్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్, సబ్-ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేశ్, హోంగార్డు రోహ్‌తాస్ ఈ పని చేసినట్లు తేలింది. పోస్టుమార్టం వంటి అధికారిక ప్రక్రియల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్ఎస్‌పీ విపిన్ టాడా వెంటనే ఎస్సై జితేంద్ర, కానిస్టేబుల్ రాజేశ్‌ను సస్పెండ్ చేసి, హోంగార్డు రోహ్‌తాస్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa