ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 09:50 PM

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ నుంచి జనవరి నెల వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఉత్సవాలు, పర్వదినాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్, జనవరి నెలల్లో పర్వదినాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని.. తమకు సహకరించాలని టీటీడీ కోరింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ 23న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.


వైకుంఠ ఏకాదశి ముందు రోజు అంటే డిసెంబర్ 29వ తేదీ, అలాగే వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30వ తేది), వైకుంఠ ద్వార దర్శనాలు ( డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు), రథ సప్తమి ( జనవరి 25) రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఆయా రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా రోజులకు ముందురోజు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.


  మరోవైపు తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు, కానుకలు అందించే సంగతి తెలిసిందే. టీటీడీకి భారీ ఎత్తున విరాళాలు అందిస్తూ టీటీడీ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు సాయం చేస్తుంటారు పలువురు భక్తులు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ కారును టీటీడీకి విరాళంగా అందించింది.


ఆ సంస్థ తరుఫున అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) కారును విరాళంగా అందించారు. అలాగే మరో తమిళనాడు భక్తుడు కూడా టీటీడీకి కారును విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును టీటీడీకి విరాళంగా అందించారు. బుధవారం రోజున శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు తాళాలు అందించారు.


టీటీడీకి కోటి రూపాయలు విరాళం


మరోవైపు తిరుమల శ్రీవారి మంగళవారం రోజున భారీ విరాళం అందింది. తమిళనాడుకు చెందిన భక్తురాలు టీటీడీకి కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈరోడ్‌కు చెందిన ఎం.సౌమ్య అనే భక్తురాలు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి.. దాతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa