వరల్డ్ కప్ భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన ఒక విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గంటల వ్యవధిలోనే స్పందించి, ఆమె స్వగ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పరిపాలనలో తనదైన వేగాన్ని చూపిస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. తన స్వగ్రామమైన మడకశిర నియోజకవర్గం, అమరాపురం మండలం, హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహెట్టికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను దీపిక ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వినతిని స్వీకరించిన పవన్ కల్యాణ్, రోడ్డు వేయిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు.ఆ హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లను పరిశీలించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.3 కోట్లు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంచనాలకు ఉప ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపి, మొత్తం రూ.6.2 కోట్ల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా, గంటల వ్యవధిలోనే నిధులు మంజూరు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa