ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ సంపాదనతో కానిస్టేబుల్ భారీ భవంతి, ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి

national |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:18 PM

కోడిన్ ఆధారిత దగ్గు సిరప్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో ఈడీ అధికారులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. డిస్మిస్ అయిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందిన లక్నోలోని ఇల్లు, ఆస్తులకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. లక్నోలోని అలోక్ ప్రతాప్ సింగ్‌ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతని ఆస్తులు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈడీ అధికారుల విచారణలో.. తాను రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి అక్రమ అమ్మకాల ద్వారా రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షల లాభం పొందినట్లు అలోక్ అంగీకరించాడు. ఈ నెట్‌వర్క్‌లో ఫెన్సిడైల్ మళ్లింపు ఆపరేషన్లను వారణాసికి చెందిన శుభం జైస్వాల్, ధన్‌బాద్‌లో శ్రేయసి మెడికల్ ఏజెన్సీ వంటి నకిలీ సంస్థలను స్థాపించడానికి అలోక్ గుర్తింపును ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూపీ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన అలోక్ ప్రతాప్ సింగ్.. ఈ కేసులో ఆరోపణలు రావడంతో.. ఇటీవల డిస్మిస్ అయ్యారు.


శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఏకకాలంలో కోడిన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో అలోక్ ప్రమేయంపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లో భాగమైన అలోక్‌ను ఫెన్సిడైల్, ఇతర కోడిన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ నిల్వ, మళ్లింపు, రవాణా ఆరోపణలపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డిసెంబర్ 2వ తేదీన లక్నోలో అరెస్ట్ చేసింది.


విచారణ సందర్భంగా.. వారణాసికి చెందిన ప్రధాన సూత్రధారి శుభం జైస్వాల్‌ను అజంగఢ్‌కు చెందిన వికాస్ సింగ్ ద్వారా కలిసినట్లు అలోక్ వెల్లడించాడు. రాంచీ నుంచి శైలి ట్రేడర్స్ అనే నకిలీ సంస్థను జైస్వాల్ అడ్డుపెట్టుకుని.. ఫెన్సిడైల్ మళ్లింపు కార్యకలాపాలను నిర్వహించేవాడని గుర్తించారు. వీటిని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లకు అక్రమంగా రవాణా చేసి భారీ లాభాలు సంపాదించారు.


అలోక్, గతంలో అరెస్ట్ అయిన అతని పార్ట్‌నర్ అమిత్ కుమార్ సింగ్ అలియాస్ అమిత్ టాటా.. ఈ అక్రమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. జైస్వాల్, వరుణ్ సింగ్, గౌరవ్ జైస్వాల్, విశాల్ మెహ్రోత్రాలతో కలిసి.. 2024 జనవరిలో ధన్‌బాద్‌లో అలోక్ ఐడీ కార్డును ఉపయోగించి నకిలీ మెడికల్ సంస్థ అయిన శ్రేయసి మెడికల్ ఏజెన్సీని స్థాపించారు. ఈ సంస్థల ఆర్థిక లావాదేవీలన్నీ జైస్వాల్, అతని చార్టర్డ్ అకౌంటెంట్ నిర్వహించేవారు. ఆ తర్వాత అలోక్ ఫోర్జరీ చేసిన డ్రగ్ లైసెన్స్‌ను ఉపయోగించి వారణాసిలో మా శారద మెడికల్ అనే మరో ఫేక్ సంస్థను సృష్టించారు.


ఈ సంస్థలు నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులను సృష్టించేందుకు ఉపయోగించుకున్నారు. అమిత్, అలోక్ కలిసి చెరో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టామని.. వాటి అక్రమ అమ్మకాల ద్వారా రూ.20-22 లక్షల లాభాలు పొందినట్లు అలోక్ విచారణలో అంగీకరించాడు. డ్రగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లను కూడా ఫోర్జరీ చేసినట్లు అలోక్ తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa