ఏపీలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో 'చాయ్రస్తా' పేరుతో సరికొత్త ఫ్రాంచైజ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ పథకం కింద తొలిదశలో 46 యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్లో ఆసక్తి గల మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కో 'చాయ్రస్తా' యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.6.60 లక్షలు, ముడిసరుకు కోసం మరో రూ.50,000 అవసరమవుతుంది. ఈ పెట్టుబడి కోసం అర్హులైన మహిళలకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇప్పించే బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తీసుకుంటుంది.ఈ అవుట్లెట్లలో గ్యాస్ అవసరం లేని ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తారు. కేవలం బటన్ నొక్కితే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్ వంటివి క్షణాల్లో సిద్ధమవుతాయి. వీటిని రూ.20 నుంచి రూ.30 మధ్య సరసమైన ధరలకు విక్రయిస్తారు. ఎంపికైన మహిళలకు గుంటూరు, విజయవాడలలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక, నలుగురు మహిళలు కలిసి ఒక యూనిట్ను నిర్వహిస్తారు.బస్టాండ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో 80 నుంచి 100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్స్ను ఏర్పాటు చేస్తారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని, మెప్మా ద్వారా నిరంతర పర్యవేక్షణ, సహకారం ఉంటాయని అధికారులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఇది ఒక మంచి అవకాశమని వారు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa