ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్ మరో సర్‌ప్రైజ్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 07:46 PM

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన సంగతే. సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చే వినతులు, అభ్యర్థనలను వేగంగా పరిష్కరించే నారా లోకేష్.. రాష్ట్ర ప్రజలకు కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఇస్తుంటారు. టీసీఎస్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సమయంలో.. నారా లోకేష్ ఇదే తరహాలోనే సోషల్ మీడియా ద్వారా సర్‌ప్రైజ్ అంటూ ప్రకటించారు. తాజాగా మరోసారి నారా లోకేష్ ఇలాంటి ట్వీటే చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెట్ రెడీ వైజాగ్.. ఈ నెలలోనే అంటూ ట్వీట్ చేసిన లోకేష్.. ఎవరో గెస్ చేయడంటూ నెటిజనానికి చిన్నపాటి పజిల్ కూడా పెట్టారు.


" వైజాగ్ గెట్ రెడీ.. ప్రపంచ ఛాంపియన్లు ఈ నెలలోనే వచ్చేస్తున్నారు. ఎవరో ఊహించండి" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే నారా లోకేష్ చేసిన ట్వీట్ ఎవరి గురించో నెటిజనం ఇట్టే కనిపెట్టేశారు. భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇటీవల వన్డే ప్రపంచకప్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో భారత మహిళల క్రికెట్ జట్టు.. విశాఖ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 21, డిసెంబర్ 23వ తేదీలలో విశాఖలోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేసిన ట్వీట్ దీని గురించే అంటూ నెటిజనం సమాధానం ఇస్తున్నారు.


మరికొంతమంది నెటిజనం మాత్రం అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ తరహాలో ఎవరైనా వస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. GOAT టూర్‌లో భాగంగా లియోనాల్ మెస్సీ.. హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కోల్ కతా వచ్చిన మెస్సీ.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ఈ నేపథ్యంలో ఈ తరహాలోనే విశాఖకు కూడా ఎవరైనా వస్తున్నారా లేదా.. మెస్సీనే తీసుకువస్తున్నారా అంటూ నెటిజనం కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం మహిళల క్రికెట్ జట్టు రాకను ఉద్దేశించే నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారని అంచనా వేస్తున్నారు.


మరోవైపు మరికొద్ది రోజుల వ్యవధిలోనే విశాఖలో మూడు క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ , శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 డిసెంబర్ 21న, రెండో టీ20 డిసెంబర్ 23వ తేదీన జరగనుంది. ఇక జనవరి 26వ తేదీన భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa