కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ వేదికగా ముగింపు పలికారు. ప్రజలు తనను ఐదేళ్ల కాలానికి ఎన్నుకున్నారని, పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని మంగళవారం నాడు శాసనసభలో ఆయన తెగేసి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో సీఎం పదవి మార్పుపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన సిద్ధరామయ్య, ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం.మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో డీసీసీ బ్యాంకుల ద్వారా రైతులకు రుణాల పంపిణీలో వివక్ష జరుగుతోందన్న అంశంపై చర్చ జరిగింది. ముఖ్యంగా సిద్ధరామయ్య సన్నిహితుడు కేఎన్ రాజన్న ప్రాతినిధ్యం వహిస్తున్న మధుగిరి, డీకే శివకుమార్ మద్దతుదారుడైన హెచ్డీ రంగనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కుణిగల్ నియోజకవర్గాల ప్రస్తావన వచ్చింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నేత ఆర్. అశోక్, ఇది కాంగ్రెస్లోని అంతర్గత కలహాల ఫలితమేమోనని వ్యాఖ్యానించారు. దీనికి సిద్ధరామయ్య బదులిస్తూ అగ్నికి ఆజ్యం పోసే పనులు చేయవద్దని హితవు పలికారు. అయితే, పార్టీలో 'అగ్గి' ఉందని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని అశోక్ ఎద్దేవా చేశారు.తాను కేవలం సామెత మాత్రమే చెప్పానని సిద్ధరామయ్య స్పష్టం చేసినప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని వదల్లేదు. కాంగ్రెస్లో కొందరు నేతలు సీఎం అయ్యేందుకు ప్రత్యేక పూజలు, యాగాలు చేస్తున్నారని అశోక్ విమర్శించారు. దీనిపై సిద్ధరామయ్య తీవ్రంగా స్పందిస్తూ, తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, 140 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ నేతలు రెచ్చిపోరని అన్నారు.ఈ క్రమంలో అశోక్ సూటిగా మీరు నిజంగా పూర్తికాలం సీఎంగా ఉంటారా అని ప్రశ్నించారు. దీనికి సిద్ధరామయ్య బదులిస్తూ వినండి ప్రజలు మమ్మల్ని ఐదేళ్లపాటు ఆశీర్వదించారు. పూర్తికాలం నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. హోంమంత్రి పరమేశ్వర జోక్యం చేసుకుంటూ, ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తర్వాత దీనిపై చర్చ అనవసరమన్నారు. దీంతో సిద్ధరామయ్య మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, "మా ప్రభుత్వం స్థిరంగా ఉంది. 2023లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, 2028లోనూ మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం" అని అన్నారు.బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతూ మీరు రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైనా సొంత మెజారిటీతో వచ్చారా ఆపరేషన్ లోటస్' ద్వారా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు తప్ప, ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ పూర్తిస్థాయిలో ఆశీర్వదించలేదు" అని విమర్శించారు. అసూయ, అసహనంతోనే బీజేపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని, తమ పార్టీలో అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa