భక్తుల సౌకర్యమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించిన టీటీడీ .. ఇందుకు ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ నియామకం చేపట్టాలని తీర్మానించింది. ఇక విద్యార్థులకు కూడా టీటీడీ పాలకమండలి శుభవార్త వినిపించింది. ఎస్వీ జూనియర్ కాలేజీల డేస్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయించింది.
సమావేశం అనంతరం ఈ వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే.. టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో చదివే డేస్కాలర్లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
మరోవైపు టీటీడీ బోర్డు నియమించిన విద్యాశాఖ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా... టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయా విద్యాసంస్థలలో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, వీటికి అవసరమైన సాఫ్ట్వేర్ల ఏర్పాటుతో పాటుగా అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అలాగే విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా.. మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
మరోవైపు తిరుమల రహదారులకు సంబంధించి టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళకు శ్రీవారి నామాల పేర్లను పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలో ఉన్న శ్రీవారి నామాలతో వీటికి నామకరణం చేయాలని నిర్ణయించిన టీటీడీ.. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసింది. జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ప్రభాకర్ కృషమూర్తిలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో.. టీటీడీ ఈవోఅనిల్కుమార్ సింఘాల్, ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa