ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా బుధవారం (డిసెంబర్ 17) మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసేసరికి 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 143 బంతుల్లో అద్భుతమైన సెంచరీ (106) బాదాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ముందు ఈ ఘనత సాధించాడు. అయితే తన తండ్రి చనిపోయాక అలెక్స్ క్యారీ ఈ ఘనత సాధించడం గమనార్హం. ఈ క్రమంలో గ్రౌండ్లో భావోద్వేగ ఘటన జరిగింది.
అలెక్స్ క్యారీ తండ్రి గార్డన్ సెప్టెంబర్లో చనిపోయారు. ఈ నేపథ్యంలోనే తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అలెక్స్ క్యారీ యాషెస్లో తొలి సెంచరీ బాదిన తర్వాత.. స్టేడియంలో ఎమోషనల్ సీన్ కనిపించింది. సెంచరీ షాట్ కొట్టిన తర్వాత క్యారీ తలెత్తి గాల్లోకి చూశాడు. సెంచరీని తండ్రికి అంకితం చేశాడు. ఈ క్రమంలో స్టేడియంలో కూర్చున్న క్యారీ భార్య ఎలోసీ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, క్యారీ దీన్ని స్పెషల్ మూమెంట్గా అభివర్ణించాడు. ఈ సందర్భంగా తన తండ్రి గార్డన్ గురించి చెప్పాడు అలెక్స్ క్యారీ. తన క్రికెట్ జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. ఎప్పుడూ తన వెంట నిలిచాడని గుర్తుచేసుకున్నాడు.
మరోవైపు, యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా హవా కొనసాగిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన ఆసీస్.. మూడో టెస్టులోనూ అదే దూకుడుతో బరిలోకి దిగింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే ఔటైనా.. రీ ఎంట్రీ ఇచ్చిన ఉస్మాన్ ఖ్వాజా, అలెక్స్ క్యారీ కలిసిన స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
వీరి వికెట్లు తీయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు బ్యాటర్లు కలిసి ఆసీస్ స్కోర్ ను ముందుకు తీసుకెళ్లారు. సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు ఉస్మాన్.. జోష్ టంగ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. 126 బంతులు ఆడిన ఖ్వాజా 82 పరుగులు బాదాడు. కాగా, మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఆసీస్ వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బ్రైడన్ కార్స్ 2, విల్ జాక్స్ 2, జోష్ టంగ్1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa