ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై సూపర్ కింగ్స్ లోకి సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి కారణం ధోనీయేనా

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 10:53 PM

ఐపీఎల్‌లో దాదాపు 12 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్. గత నెలలో నాటకీయ పరిణామాల మధ్య సీఎస్‌కే ఇతడిని ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది. దీనికి బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్‌ జట్టులోకి వెళ్లారు. ప్రస్తుతం అతడికి ఉన్న రూ. 18 కోట్ల ఫీజుకే సంజూను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్‌ను ఏరికోరి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎందుకు జట్టులోకి తీసుకుంది అనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ విషయంపై తాజాగా సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ఈ ట్రేడింగ్ వెనుక ఉద్దేశమేంటో తెలిపాడు.


ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తు.. ఈ ట్రేడింగ్‌లో ఎలా కీలక పాత్ర పోషించిందో వివరించారు స్టీఫెన్ ఫ్లెమింగ్. ధోనీ రిటైర్మెంట్ తర్వాత.. టీమ్ ఫ్యూచర్ కోసం సన్నాహాలు చేయాలని సీఎస్‌కే అనుకుంటోందని చెప్పాడు. అందుకే శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నామని ఫ్లెమింగ్ తెలిపాడు. "మా (సీఎస్‌కే) ఓపెనింగ్ బ్యాటింగ్‌ ఇంకా కొంత బలహీనంగా ఉందని మేము భావించాము. అంతేకాకుండా ఏదో ఒక సమయంలో ధోనీ జట్టు నుంచి తప్పుకుంటాడనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము. మరోవైపు, సంజూ ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. అతను తన పాత్రను చాలా చక్కగా పోషిస్తాడని అనుకున్నాం. అందుకే జట్టులోకి తీసుకున్నారం. ఇది ధోనీ తర్వాత తరం వారసత్వ ప్రణాళిక మాత్రమే కాదు. పూర్తిగా జట్టును పునరుత్తేజపరచడం మా ఉద్దేశం. రెండేళ్ల తర్వాతే కాదు.. ఆరేళ్ల తర్వాత కూడా చెన్నై జట్టు ఎలా ఉంటుందో చూడటం కూడా దీని ఉద్దేశం" అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.


కాగా, 44 ఏళ్ల ధోనీ తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. తను ఆడాలనుకున్నా పరిస్థితులు సహకరించే అవకాశం లేదు. ఇక కేరళకు చెందిన సంజూ వయసు ఇప్పుడు కేవలం 31 సంవత్సరాలే. ఒకవేళ అతడు తన ఫామ్, ఫిట్‌నెస్‌ను కొనసాగించగలిగితే.. కనీసం మరో ఐపీఎల్ సీజన్ వరకు అయినా సీఎస్‌కే తరఫున ఆడే అవకాశం ఉంది. చెన్నై జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫామ్ నిలకడగా ఉంటే.. సారథ్య బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.


కాగా, అనుభవం ఉన్న ప్లేయర్లను తీసుకోవడంలో చెన్నై పెట్టింది పేరు. అయితే అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యంగ్ ప్లేయర్లపై భారీ ఇన్వెస్ట్ చేసింది. అందులో భాగంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ, ఆల్‌రైండర్ ప్రశాంత్ వీర్‌ను రూ.14.2 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. వీరితో పాటు బౌలింగ్ విభాగంలో మాట్ హెన్రీ, అకీల్ హుస్సేన్‌ను కూడా తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa