ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడి దాగిఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 01:08 PM

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ అన్నారు. అయన మాట్లాడుతూ... ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్‌ జగన్‌ గారు నాడు 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్‌ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్‌ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే... ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైయస్‌ జగన్‌ గారు నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటువ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్‌ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ. 100లకు ధారాదత్తం చేశాడు. ఇదికాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్‌ కాలేజీలకు దాదాపు రూ. 1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటువ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.  మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్‌ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు అని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa