ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 07:05 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సూచీలు, చివరికి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించినప్పటికీ ఆటో, మెటల్, ఫార్మా రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కిందకు లాగింది.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 78 పాయింట్లు నష్టపోయి 84,482 వద్ద స్థిరపడింది. దీంతో సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసినట్లయింది. ఈ నాలుగు రోజుల్లో సూచీ సుమారు 785 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కేవలం 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,815.55 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 542 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఒక దశలో 84,238 కనిష్ఠ స్థాయికి పడిపోయి, ఆ తర్వాత 84,780 గరిష్ఠ స్థాయికి చేరింది.సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్ దాదాపు 2 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ కూడా లాభాల్లో ముగిశాయి. మరోవైపు, సన్ ఫార్మా షేరు 2.7 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. కంపెనీకి చెందిన బస్కా ప్లాంట్‌పై యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ ప్రతికూల నివేదిక ఇవ్వడం ఇందుకు కారణమైంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎల్&టీ, ఎన్టీపీసీ షేర్లు కూడా నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా లాభపడగా, పవర్ సెక్టార్ 1 శాతం, ఆటో రంగం 0.5 శాతం నష్టపోయాయి. ఇక అమెరికా ద్రవ్యోల్బణం, నిరుద్యోగ గణాంకాలు, ఇతర అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం మదుపరులు వేచి చూస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. నిఫ్టీకి 25,700 వద్ద మద్దతు, 25,900 వద్ద నిరోధం ఉందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa