ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదో చెత్త ఒప్పందం... న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విమర్శలు

international |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 10:18 PM

భారత్‌ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కివీస్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదో చెత్త ఒప్పందమని, స్వేచ్ఛగా లేదా న్యాయంగా లేదని పార్లమెంట్‌‌లో తమ పార్టీ దీనిని అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ (ఎన్పీపీ) భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం వల్ల న్యూజిలాండ్‌కు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, ముఖ్యంగా పాల ఉత్పత్తుల రంగంలో నష్టపోతుందని ఆ పార్టీ నేత విన్‌స్టన్ పీటర్స్ అన్నారు. ఈ ఒప్పందం వల్ల న్యూజిలాండ్ తన మార్కెట్‌ను భారత్‌కు పూర్తిగా తెరిచినప్పటికీ, భారత్ మాత్రం న్యూజిలాండ్ పాల ఉత్పత్తులపై ఉన్న అధిక సుంకాలను తగ్గించడానికి అంగీకరించలేదని ఆయన విమర్శించారు. రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ ఒప్పందాన్ని వివరించడం కష్టమని పీటర్స్ అభిప్రాయపడ్డారు.


ఇది నాణ్యతలేని ఒప్పందమని ఆ పార్టీ అభివర్ణించింది. దీనిపై తొందరపాటు వద్దని, పూర్తి పార్లమెంటరీ కాలం ఉపయోగించుకుని మెరుగైన ఒప్పందం చేసుకోవాలని తమ మిత్రపక్షమైన నేషనల్ పార్టీని కోరింది. ఈ ఒప్పందానికి పార్లమెంటులో మద్దతు వస్తుందో? రాదో? తెలియకపోయినా, సంతకం చేయవద్దని హెచ్చరించింది.


ఆమోదం కోసం గతవారం క్యాబినెట్‌‌లో ఈ ఒప్పందాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఎన్పీపీ ‘అంగీకరించి, విభేదించాం’ అనే నిబంధనను ఉపయోగించుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది.


విదేశాంగ మంత్రి న్యూజిలాండ్ చరిత్రలో పాల ఉత్పత్తులైన పాలు, జున్ను, వెన్న వంటి వాటిని మినహాయించిన మొదటి వాణిజ్య ఒప్పందం కానుందని ఆరోపించారు. నవంబర్ 2025 నాటికి ముగిసిన ఏడాదితో న్యూజిలాండ్ పాల ఉత్పత్తుల ఎగుమతులు సుమారు 13.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది దేశం మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉంది.


భారతదేశంతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పీటర్స్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా భారత పౌరుల కోసం కొత్త ఉపాధి వీసాను ప్రవేశపెట్టడం, విద్యార్థులకు ఉద్యోగ హక్కులను విస్తరించడం వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం న్యూజిలాండ్ కార్మిక మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, భవిష్యత్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ వ్యతిరేకత భారతదేశంతో సంబంధాలను బలహీనపరచదని, వ్యూహాత్మకంగా ఈ సంబంధం ముఖ్యమని పీటర్స్ స్పష్టం చేశారు.


పీటర్స్ తన పార్టీ వైఖరిని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు తెలియజేశారు. ఈ వ్యతిరేకత భారత్ లేదా దాని ప్రతినిధులపై విమర్శ కాదని, న్యూజిలాండ్ సంకీర్ణ ప్రభుత్వంలోని భిన్నాభిప్రాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ ఎప్పుడూ దేవ ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే ఒప్పందాలకు మద్దతు ఇస్తుందని, లేనివాటిని వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.


ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లు తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో భారత్‌కు కల్పించిన దానికంటే, న్యూజిలాండ్ ఎక్కువ అవకాశాలు కల్పించిందని ఆయన వాదించారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంతో సంబంధాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవని పీటర్స్ నొక్కి చెప్పారు. విదేశాంగ మంత్రిగా ఆస్ట్రేలియా, పసిఫిక్ దేశాల తర్వాత తాను మొదట సందర్శించిన దేశం భారతదేశమేనని ఆయన గుర్తు చేశారు. ఈ సంబంధం కోసం దౌత్యపరమైన వనరులను కూడా పెంచినట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa