ఇటీవల మధ్య ఆసియాలో సంచలనం సృష్టించిన ప్రముఖ హత్యలలో ఒకటైన హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు కొద్ది గంటల ముందే అతడ్ని తాను కలిశానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. తాను ఇరాన్ పర్యటనలో ఉన్నప్పుడే హనియో హత్యకు గురైనట్టు వివరించారు. గతేడాది ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సైనిక కాంప్లెక్స్లో ఉన్న హమాస్ నేత హనియో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెన్స్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రిక్వెస్ట్తో భారత ప్రతినిధిగా హాజరైనట్టు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టెహ్రాన్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో పలు దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులకు బస ఏర్పాటుచేశారని, ఆ సమయంలో అనధికారికంగా వారందరం కలిశామని చెప్పారు. గడ్కరీ మాట్లాడుతూ ‘‘వివిధ దేశాల అధినేతలు అందరూ హాజరయ్యారు, కానీ దేశాధినేత కాని ఒక వ్యక్తి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా. నేను అతడ్ని కలిశాను. అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తితో పాటు అతడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడం నేను చూశాను’ అని పేర్కొన్నారు.
‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం నేను హోటల్కు తిరిగి వెళ్లాను.. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారత్లోని ఇరాన్ రాయబారి తన వద్దకు వచ్చి, తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉందని చెప్పారు..."ఏం జరిగిందని నేను అడిగాను. హమాస్ అధినేత హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. నేను షాక్ అయ్యాను, ఎలా జరిగిందని అడిగితే ఆయన 'ఇంకా నాకు తెలియదు' అని అన్నారు’ అని గడ్కరీ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు..
జులై 31న తెల్లవారుజామున 1:15 గంటలకు ఈ హత్య జరిగినట్లు ఇరాన్ అధికారులు ధ్రువీకరించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పర్యవేక్షణలో ఉన్న అత్యంత భద్రత కలిగిన సైనిక సముదాయంలో హనియా ఉండగా.. దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన అంగరక్షకుడు కూడా మరణించారు.
గడ్కరీ మాత్రం హమాస్ నేత ఎలా చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టత లేదని అన్నారు. ‘కొంతమంది ఆయన తన మొబైల్ ఫోన్ వాడటం వల్లే చనిపోయారని అంటున్నారు. మరికొందరు వేరే విధంగా జరిగిందని చెబుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒక దేశం బలంగా ఉంటే, ‘ఏ దేశం కూడా దాని జోలికి రాలేదని’ అన్నారు. దీనికి ఇజ్రాయెల్ను ఉదాహరణగా చూపుతూ.. సాంకేతిక నైపుణ్యం, సైనిక సామర్థ్యంతో ఒక చిన్న దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపగలదని ఆయన వ్యాఖ్యానించారు. హనియా ఉండే భవనాన్ని లక్ష్యంగా చేసుకుని స్వల్ప-శ్రేణి క్షిపణిని ఉపయోగించారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఈ దాడి జరిగినప్పుడు అధ్యక్షుడు పెజెష్కియన్ ప్రమాణ స్వీకారానికి హనియో హాజరయ్యారు.
టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా బస చేసిన భవనంలో బాంబులను ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇరాన్ భద్రతా సిబ్బందిని వాడింది. మే 2024లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ అంత్యక్రియలకు హాజరైనప్పుడే హమాస్ అధినేతను చంపడానికి మొసాద్ ప్లాన్ చేసినట్టు తెలిపింది. అయితే, భారీగా జనం గుమిగూడటం వల్ల ఆ ఆపరేషన్ విఫలం కావడం లేదా బయటపడే ప్రమాదం పెరుగుతుందని అధికారులు భావించి, ఆ యత్నాన్ని విరమించుకున్నారని పేర్కొంది. తర్వాత ఉత్తర టెహ్రాన్లోని ఐఆర్జీసీ గెస్ట్హౌస్పై దృష్టి సారించారు. అది హమాస్ నేత బస చేసే అవకాశం ఉన్న ప్రదేశమని అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa