ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 నెలల్లో ఎయిర్‌పోర్టు రేంజులో.. రూ.500 కోట్లతో పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 08:06 PM

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత స్టేషన్లన్ల పథకం కింద ఏపీలో సుమారుగా 70కి పైగా రైల్వేస్టేషన్లల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అలాగే ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలు వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్ పోర్టు రేంజులో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ.. పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులపై విశాఖ ఎంపీ భరత్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులతో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను ఎంపీ భరత్ పరిశీలించారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన భరత్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. రూ. 500 కోట్ల వ్యయంతో విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు ఎంపీ భరత్ వెల్లడించారు. వివిధ కారణాలతో ఈ పనులు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులలో వేగం పెరిగిందన్నారు. 20 నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్‌ల ఆధునికీకరణ, పశ్చి రైల్వే గేట్ పనులు చేపడుతున్నట్లు ఎంపీ భరత్ వివరించారు.


మరోవైపు విశాఖ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్లాట్‌ఫామ్ సంఖ్య కూడా పెరగనుంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం 8 ప్లాట్‌ఫామ్‌లు ఉండగా.. అదనంగా మరో 6 ప్లాట్ ఫామ్‌లు నిర్మించనున్నారు. మొత్తంగా ఫ్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కు పెంచనున్నారు. ఏపీలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ఒకటైన విశాఖ రైల్వే స్టేషన్‌ను వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది.


2027 నాటికి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కోర్టు కేసులు సహా వివిధ కారణాలతో విశాఖ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులలో ఇన్ని రోజులు జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం కావటంతో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa