ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 09:20 PM

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిపోయినా.. కనీస మౌలిక వసతులు లేని గ్రామాలు ఎన్నో. చదువుకోవడానికి పాఠశాలలు, ఉండటానికి పక్కా ఇల్లు, రాకపోకలు సాగించడానికి రహదారులు, వైద్య చికిత్సల కోసం ఆస్పత్రులు లేని పల్లెలెన్నో.. ఈ వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పల్లెవాసులు ఎందరో. అయితే మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు అత్యవసరమైనది వైద్యం. సకాలంలో వైద్యం, మందులు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యులెందరో. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు, బ్లడ్ యూనిట్లు సరఫరా చేయాలని నిర్ణయించింది.


గిరిజన ప్రాంతాలలో ఉండే ఆస్పత్రులకు ఔషధాలు, బ్లడ్ యూనిట్లను డ్రోన్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రెడ్ వింగ్ అనే సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. పైలెట్ ప్రాజెక్టు కింద అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్లు, వ్యాక్సిన్ల పంపిణీ జరగనుంది. పాడేరు కేంద్రం నుంచి దూరప్రాంతాలలో ఉండే ఆసుపత్రులకు డ్రోన్లను ఉపయోగించి మందులు, బ్లడ్ యూనిట్స్ పంపిస్తారు. అనంతరం రాబోయే రోజుల్లో విశాఖ కేజీహెచ్‌ నుంచి కూడా ఈ సేవలను విస్తరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.


రెడ్ వింగ్ అనే సంస్థ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం మొదటి 7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించనుంది. పాడేరు కేంద్రం నుంచి 60 నుంచి 80 కి.మీ. పరిధిలో ఉన్న ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల సాయంతో.. మందులు, వ్యాక్సిన్లు అందిస్తారు. మరోవైపు ఒక్కో డ్రోన్ 2 కిలోల వరకూ బరువును మోసుకెళ్లగలదు.


ఇక ఇవే డ్రోన్ల సాయంతో రోగుల నుంచి పరీక్షల కోసం సేకరించిన శాంపిళ్లను కూడా ల్యాబ్‌లకు తరలించవచ్చు. వెళ్లేటప్పుడు మందులు మోసుకెళ్లే డ్రోన్లు.. తిరిగి వచ్చే సమయంలో రోగుల బ్లడ్ శాంపిల్స్, ఇతరత్రా నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తీసుకురావటంలో ఉపయోగపడతాయి. జనవరి నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa