బంగ్లాదేశ్లో హిందూ యువకులను కొట్టిచంపిన ఘటనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనలు ఆందోళనకరమని కేంద్రం అభివర్ణించింది. ఈ దాడులను తేలికగా కొట్టిపారేయలేమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు పొడువున జరుగుతోన్న పరిణామాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. హిందువులపై హింసను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి కారణమైనవారిని గుర్తించి, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు.
‘‘బంగ్లాదేశ్లో ఇటీవల జరుగుతోన్న పరిణామాలు గురించి మనందరికీ తెలుసు.. వాటిని నిశితంగా గమనిస్తున్నాం.. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది.. మన వైఖరి గతంలో ఎలా ఉండేది.. ఎలా ఉండాలి.. ఈ రోజు ఎలా ఉంది అనే విషయాలను నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను... బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై ఇస్లామిక్ ర్యాడికల్స్ దాడులు, నిరంతర శత్రుత్వం తీవ్ర ఆందోళన కలిగించే విషయం’ అని జైస్వాల్ అన్నారు.
‘మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నాం..ఈ నేరానికి పాల్పడిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని ఆశిస్తున్నాం.... తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హత్యలు, దహనాలు, భూ కబ్జాలు సహా మైనారిటీలపై జరిగిన 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలను స్వతంత్ర వర్గాలు నమోదు చేశాయి. ఈ సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా లేదా రాజకీయ హింసగా తోసిపుచ్చలేం’ అని రణధీర్ జోడించారు.
విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ ర్యాడికల్ మూక.. ఢాకా వీధుల్లో విధ్వంసానికి తెగబడుతోంది. గతవారం దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడ్ని దైవదూషణ ఆరోపణలతో కొట్టిచంపారు. అంతటితో ఆగకుండా శవాన్ని జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి రోడ్డు మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే, బుధవారం రాత్రి మరో హిందువును దుండగులు కొట్టిచంపారు. రాజ్బరి జిల్లా పంగషా తాలూకాలోని అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ను హత్యచేశారు. హోసెన్డంగా ఓల్డ్ మార్కెట్లో దాడి జరిపిన కొద్దిసేపటికే సామ్రాట్ చనిపోయాడని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa