చైనాలో ఉండే రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి అని ప్రపంచం మొత్తం తెలిసిందే. అయితే అక్కడ ఓ మారుమూల పల్లెలో పెట్టిన వింత కండిషన్లు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెళ్లికి ముందు గర్భం దాల్చడం.. ఇతర రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకోవడం, అసలు పెళ్లి చేసుకోకపోవడం సహా మరికొన్నింటిపై భారీ జరిమానాలు విధిస్తూ ఆ గ్రామ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన అంటూ నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ఆ నోటీసును తొలగించారు. చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా జననాల రేటును పెంచడానికి ప్రయత్నిస్తుంటే.. ఒక గ్రామం ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టడం ఆశ్చర్యకరంగా మారింది.
చైనాలోని యునాన్ ప్రావిన్స్లో గల లింకాంగ్ గ్రామంలో ఈ వివాదం తలెత్తింది. "గ్రామ నిబంధనలు.. అందరూ సమానమే" పేరుతో ఉన్న ఒక నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లింకాంగ్ గ్రామ కమిటీ రూపొందించిన ఈ నోటీసులో వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా పలు అంశాలు ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. యునాన్ ప్రావిన్స్ కాకుండా బయటి వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే 1500 యువాన్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.17,500 జరిమానా విధిస్తున్నారు.
ఇక పెళ్లికి ముందే గర్భం దాల్చితే వారికి 3 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.35 వేలు చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి నివసించే జంటలకు ఏడాదికి 500 యువాన్లు అంటే రూ.6400 జరిమానా వేస్తారు. పెళ్లి అయిన 10 నెలల లోపే ఆ జంటకు సంతానం కలిగితే 3 వేల యువాన్లు అంటే రూ.35 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.
మరోవైపు.. భార్యాభర్తలు గొడవలు పడినా ఇలాంటి శిక్షలు వేస్తున్నారు. దంపతులు గొడవ పడి.. ఆ సమస్యను పరిష్కరించడానికి గ్రామ అధికారులను పిలిపిస్తే.. గొడవ పడ్డ ఇద్దరూ చెరో 500 యువాన్లు అంటే రూ.6400 కట్టాల్సి ఉంటుంది. తాగి గ్రామంలో గొడవలు చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు (రూ.35 వేల నుంచి రూ.60 వేలు) వరకు భారీ జరిమానా విధిస్తారు. గ్రామంలో పుకార్లు పుట్టించినా లేదా నిరాధారమైన ఆరోపణలు చేసినా 500 నుంచి 1,000 యువాన్లు (రూ.6400 నుంచి రూ.12,800) వరకు ఫైన్ పడుతుంది.
చైనా ప్రభుత్వ స్పందన
ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం 2025లో ఉన్నామా లేక 1925లో ఉన్నామా అంటూ నెటిజన్లు చైనా గ్రామ కమిటీని ప్రశ్నించారు. ఈ వివాదం ముదరడంతో మెంగ్డింగ్ పట్టణ ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఆ గ్రామం పెట్టిన నిబంధనలు చాలా వింతగా ఉన్నాయని.. గ్రామ కమిటీ తమంతట తామే.. పై అధికారుల అనుమతి లేకుండానే ఈ నోటీసును పెట్టారని తెలిపారు. ప్రస్తుతం దాన్ని తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa