ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు యువతులు.. అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ మరణ వార్త తెలిసి వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని కోరుతున్నారు. చేతికి అందిన బిడ్డల అకాల మరణంతో.. వారి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు మృతుల కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24)గా గుర్తించారు.
పులఖండం మేఘనారాణి, కడియాల భావన ఉన్నత చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరితో కలిసి మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లారు. టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద భావన, మేఘరాణి ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మేఘరాణి, భావన మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తల్లీ కూతురు మృతి..
2025 అక్టోబర్లో అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో మంచిర్యాలకు తల్లి, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని షికాగోలో ఈ ప్రమాదం జరిగింది. విశ్రాంత సింగరేణి కార్మికుడు పాత విఘ్నేష్, రమాదేవి దంపతులకు కుమార్తెలు స్రవంతి, తేజస్వి ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ నెల 11న చిన్న కుమార్తె తేజస్వి గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో.. విఘ్నేష్ దంపతులు సెప్టెంబర్ 18న ఆమెరికా వెళ్లారు.
గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్న తర్వాత.. పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు నిశాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని విఘ్నేష్, రమాదేవి(55), తేజస్వి(30) తదితరులు రాత్రి కారులో మరో ప్రాంతానికి వెళ్తుండగా.. షికాగో సమీపంలో టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మిగతా కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికా రోడ్డు భద్రతా చట్టాలు పాటించకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని తెలుస్తోంది. సూచించిన స్థానం కాకుండా వేరే ప్లేస్లో యూ-టర్న్ తీసుకోవడం, రాంగ్ సైడ్లో డ్రైవింగ్, వేగంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక వివిధ రకాల పార్ట్జాబ్లు చేస్తున్న భారతీయ విద్యార్థులు అలసట వల్ల ఇలా ప్రమాదాలకు గురవుతున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa