ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవంతంగా పూర్తయిన 'వందేభారత్ స్లీపర్' రైలు ట్రయల్ రన్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 01:36 PM

'వందేభారత్ స్లీపర్' రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య జరిగిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది.ఈ సందర్భంగా రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు అధికారులు వినూత్నంగా 'వాటర్ టెస్ట్' నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నా, లోపల టేబుల్ మీద పిరమిడ్ ఆకారంలో ఒకదానిపై ఒకటి పేర్చిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద ప‌డ‌లేదు. వీడియోలో మొబైల్ స్పీడోమీటర్ పై 182 కిలోమీటర్ల వేగం కనిపిస్తున్నప్పటికీ, రైలు ఏమాత్రం కుదుపులకు లోనుకాకుండా సాఫీగా ప్రయాణించిందని, ఇది ఈ కొత్త తరం రైలు సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని మంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లు సెమీ-హైస్పీడ్ చైర్ కార్ సేవలను మాత్రమే అందిస్తున్నాయి. అయితే దూర ప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారి కోసం అత్యాధునిక హంగులతో ఈ స్లీపర్ వెర్షన్ ను రైల్వే శాఖ రూపొందించింది. రానున్న రోజుల్లో ఏసీ క్లాస్ ప్రయాణికులకు విమాన తరహా ప్రయాణ అనుభూతిని, సౌకర్యాన్ని ఈ రైళ్లు అందించనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే రద్దీగా ఉండే రూట్లలో దూర ప్రాంతాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa