ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోం మంత్రి అనిత ఇలాఖాలో బాంబుల మోత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 08:13 PM

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఇలాఖాలో బాంబుల మోత మోగుతోంది. రోజూ పది నుంచి 15 వరకూ బాంబులు పేలుతున్నాయి. గడిచిన ఏడు నెలలుగా ఈ బాంబుల మోత కారణంగా.. స్థానికులు అవస్థలు పడుతున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లకు బీటలు వారుతూ ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని దుర్గా నగర్ కాలనీ వాసుల అవస్థ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ఎడమ కాలువ .. పాయకరావుపేట నియోజకవర్గంలోని దుర్గానగర్ సమీపంలో ఉన్న కొండలను ఆనుకుని వెళ్తుంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా.. ఈ కొండలను తొలిచి.. కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.


అయితే ఈ కొండలలోని బండ రాళ్లను పగలగొట్టేందుకు కాంట్రాక్టర్లు బాంబులు ఉపయోగిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. సులువుగా పగిలే బండరాళ్లను కూడా డబ్బులు మిగుల్చుకోవాలనే ఉద్దేశంతో.. రోజూ 10 నుంచి 15 బాంబులు పెట్టి పేల్చుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి రోజూ బాంబులు పేలుస్తూ ఉండటంతో.. దుమ్మూ, ధూళి, పొగతో తమ ఆరోగ్యాలకు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. బాంబుల శబ్ధం కారణంగా నిద్ర లేకుండా పోతోందని వాపోతున్నారు. మరోవైపు బాంబులు పేల్చే ప్రదేశానికి దుర్గానగర్ కాలనీకి కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరం ఉంటుంది. దీంతో బాంబు పేలుళ్లకు ఆ బండరాళ్లు ఇళ్ల మీద పడతాయనే భయంతో దుర్గానగర్ వాసులు భయపడిపోతున్నారు.


అలాగే కష్టపడి కట్టుకున్న తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వమే పేల్చేస్తే తాము ఎవరితో చెప్పుకోవాలని అంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మార్వోతో పాటుగా, హోం మంత్రి వంగలపూడి అనితను కోరామని.. అలాగే మంగళగిరిలో నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లి విజ్ఞప్తి చేసినప్పటికీ తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదంటున్నారు. ప్రొక్లెయిన్లు, జేసీబీలతో కాలువ నిర్మాణ పనులు చేపడితే తమకు అభ్యంతరం లేదని.. కానీ కాంట్రాక్టర్లు బాంబులు ఉపయోగిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం ఆరు తర్వాత బాంబులు పెట్టకూడదని తెలిసినా.. వాస్తవంగా మాత్రం పరిస్థితి వేరేలా ఉందంటున్నారు.


మరోవైపు పర్యావరణవేత్త, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాల కంటే కాంట్రాక్టర్ లాభమే ముఖ్యమనిపించేలా అధికారుల నివేదికలు మారుతున్నాయని ఆరోపించారు. యంత్రాలతో తవ్వితే ఖర్చు ఎక్కువ అవుతుందని.. అందుకే ప్రజల ఇళ్లు కూలిపోయినా పర్వాలేదు కానీ, కాంట్రాక్టర్ జేబు నుండి పైసా అదనంగా ఖర్చు అవ్వకూడదనే తాపత్రయంతో అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


తక్షణమే భారీ పేలుళ్లను నిలిపివేసి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పనులు కొనసాగించాలని.. అబద్ధపు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బాధితుల ఇళ్ళకి, ఆరు నెలలుగా వారికి కలిగిన మానసిక క్షోభకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa