కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు రక్తపాతానికి దారితీసింది. ఒక బ్యానర్ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు, కాల్పులకు దారితీయగా.. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు మృతి చెందారు. గంగావతి ఎమ్మెల్యే, కేఆర్పీపీ నేత గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వివరాల్లోకి వెళితే...బళ్లారి నగరంలో జనవరి 3న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్యానర్ను బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు, హవాంబవి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా రాళ్ల దాడికి, ఆపై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త, బళ్లారి హుస్సేన్ నగర్ నివాసి అయిన రాజశేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందారు.ఘటన అనంతరం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa