ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది 'చెత్త పొరుగు దేశం' అంటూ.. పాకిస్థాన్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 07:50 PM

దాయాది పాకిస్థాన్‌పై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ శుక్రవారం (జనవరి 2న) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అది ‘ఓ చెడ్డ పొరుగు దేశం’ అని, ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని పునరుద్ఘాటించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌‌లో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ... ‘మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఎవరూ మనకు చెప్పలేరు’ అని ఆపరేషన్ సిందూర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రజల భద్రత కోసం గతేడాది ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన భారత్ పాకిస్థాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలు, మౌలిక సౌకర్యాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.


‘కొన్నిసార్లు మన పక్కింటిలో చెడ్డవాళ్లు కూడా ఉంటారు... దురదృష్టవశాత్తూ మన దేశానికి అలాంటి పరిస్థితి ఎదురైంది. పశ్చిమాన ఉన్న దేశాన్ని చూసినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా, నిరంతరం, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే దానిని నుంచి మన ప్రజలను కాపాడుకునే హక్కు మనకు ఉంది. ఆ హక్కును మేము తప్పకుండా వినియోగిస్తాం.. ఆ హక్కును ఎలా వినియోగించుకోవాలనే నిర్ణయం మనది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో ఎవ్వరూ మనకు చెప్పలేరు. స్వీరక్షణ కోసం అవసరమైనది ఏదైనా మేము చేస్తాం’ అని జైశంకర్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.


ఇదే సయమంలో 1960 భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి కూడా విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ‘చాలా సంవత్సరాల కిందట నీటి పంపకాలకు అంగీకరించాం. కానీ దశాబ్దాల పాటు ఉగ్రవాదం కొనసాగితే పొరుగువారితో మంచి సంబంధాలు ఉండవు. మంచి సంబంధాలు లేకపోతే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మీరు పొందలేరు. దయచేసి మాకు నీళ్లు ఇవ్వండి.. కానీ నేను మాత్రం మీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తాను అని మీరు అనలేరు. అది పొంతన లేని విషయం.’ అని జైశంకర్ స్పష్టం చేశారు.


భారత్‌కు వివిధ రకాలైన చాలా మంది పొరుగువారు ఉన్నారని ఆయన అన్నారు. ‘మనకు మంచి చేసే లేదా కనీసం హాని చేయని పొరుగువారు ఉంటే, ఆ పొరుగువారి పట్ల దయతో ఉండటం, వారికి సహాయం చేయడం అనేది మన సహజ స్వభావం, ఒక దేశంగా మనం కూడా అదే చేస్తాం’" అని ఆయన అన్నారు. కాగా, ఇటీవల జైశంకర్ మాట్లాడుతూ, దేశంలో చాలా వరకు సమస్యలు పాకిస్థాన్ సైన్యం నుండే పుట్టుకొస్తున్నాయని అన్నారు.


ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉన్నట్లే సైనిక నాయకుల్లో మంచివారు, స్పష్టంగా అంత మంచివారు కాని వారు కూడా ఉంటారని ఆయన అన్నారు. పరోక్షంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ గురించి జేశంకర్ మాట్లాడారు. ఇక, పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్, పీఓకేలోని ఉగ్రవాదులకు చెందిన 9 స్థావరాలను ధ్వంసం చేసి, 100 మందికిపైగా ముష్కరులను హతమార్చింది. దీనికి పాకిస్థాన్ ప్రతీకార దాడులకు ప్రయత్నించగా.. వాటిని భారత్ అడ్డుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa