ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నా భర్త తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు": బాంగ్లాదేశ్ బాధితుడి భార్య కన్నీటి పర్యంతం

international |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 09:49 PM

బాంగ్లాదేశ్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. బుధవారం రాత్రి షరియత్ పూర్ జిల్లాలో ఖోకాన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మారణాయుధాలతో నరికి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ ఘటనను వివరిస్తూ.. బాధితుడి భార్య సీమా దాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తమకు ఎవరూ శత్రువులు లేరని, హిందువులమనే ఒకే ఒక్క కారణంతో తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త తలపై నిప్పు చంపాలని చూశారాని పేర్కొన్నారు.


సజీవ దహనానికి పైశాచిక యత్నం


ఢాకాకు 150 కిలో మీటర్ల దూరంలోని గ్రామంలో ఖోకాన్ చంద్ర దాస్ మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్తుండగా.. ముస్లిం మతోన్మాద మూక ఆయనపై దాడికి తెగబడింది. ముందుగా మారణాయుధాలతో ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసి.. ఆపై ఖోకాన్ తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ప్రాణభయంతో ఆయన సమీపంలోని చెరువులోకి దూకడంతో మంటలు ఆరిపోయాయి, కానీ అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది.


"మాకు ఎవరితోనూ తగాదాలు లేవు. శత్రువులు లేరు. మేము హిందువులం కాబట్టే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రశాంతంగా జీవించాలనుకోవడం మా తప్పా?" అని బాధితుడు ఖోకాన్ దాస్ భార్య సీమా దాస్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఖోకాన్ ఢాకా మెడికల్ కాలేజీలో తన భర్త మృత్యువుతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఒక కంటికి శస్త్రచికిత్స పూర్తయిందని, శరీరంలో రక్తం లేక ఆరు యూనిట్ల రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు.


బయటపడని భయం.. అబద్ధపు బుకాయింపులు


బాంగ్లాదేశ్‌లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే.. బాధితులకు సాయం చేసే వారు కూడా తమ పేర్లు బయట పెట్టడానికి భయపడుతున్నారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో హిందువులపై నిరంతర శతృత్వం కొనసాగుతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాల్లోనే ఇది నాలుగో అతిపెద్ద దాడి కావడం గమనార్హం.


మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయని మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ.. మతోన్మాదులకు ప్రభుత్వం పరోక్షంగా కొమ్ముకాస్తోందని విమర్శలు వస్తున్నాయి. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఖోకాన్ దాస్ ప్రాణాలతో బయటపడతారో లేదో తెలియని స్థితిలో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa