ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక తుఫాన్ బాధితులకు అండగా బీసీసీఐ

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 10:26 PM

ఇటీవల శ్రీలంకను వణికించింది దిత్వా తుఫాన్. ఈ తుఫాన్ సృష్టించిన బీభత్సం కారణంగా ఆ దేశంలో ప్రాణ నష్టం భారీగా పెరిగింది. తుఫాన్ ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. కొండచరియలు విరిగిపడటం వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తు దాదాపు 12 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కష్టకాలంలో శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ 'ఆపరేషన్ సాగర బంధు'తో చేపట్టిన విషయం తెలిసిందే. భారత వాయసేన, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కూడా మంచి మనసు చాటుకుంది. శ్రీలంకకు సాయం చేసేందుకు కొత్త షెడ్యూల్‌ రూపొందించింది.


దిత్వా తుఫాన్‌ బాధితులకు సహాయం చేయడానికి బీసీసీఐ ముందుకు వచ్చింది. భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో శ్రీలంకలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. అయితే ఈ టూర్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. టెస్ట్‌లతో అదనంగా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకారం తెలిపింది. ఈ సిరీస్‌ల మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దిత్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు సంకల్పించింది. అయితే టీమిండియా వార్షిక షెడ్యూల్‌లో లేకపోయినా.. టూర్ ఎక్స్‌టెన్షన్‌ను ప్లాన్‌ చేసింది బీసీసీఐ.


ఈ అదనపు మ్యాచ్‌ల షెడ్యూల్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు.. శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వా తెలిపారు. కాగా, ఈ ఎక్స్‌ట్రా టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని సిల్వా వెల్లడించారు. కాగా, తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు టీమిండియా డిసెంబర్‌లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు అంగీకరించింది. ఆ పర్యటన ఖరారు కాలేదు. దీంతో ఆగస్టు విండో ప్రతిపాదనకు కూడా బీసీసీఐ సమ్మతం తెలిపింది.


ఇదిలా ఉండగా, దిత్వా తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నడుం బిగించింది. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రీబిల్డ్ శ్రీలంక అనే కార్యక్రమానికి అంకితం చేసింది. అంతేకాకుండా పర్యాటకంపై ఆధారపడిన ఈ దేశానికి పూర్వవైభవం తీసుకొచ్చేటట్లు విజిట్ శ్రీలంక పేరుతో.. ఈ సిరీస్‌లో ప్రత్యేక ప్రచారం చేయనున్నారు. మరోవైపు, భారత అందించిన సాయంపై శ్రీలంక అధ్యక్షుడు, లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య వంటి ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ చేస్తోన్న సాయం మరువలేనిదని, భారత్ తమకు పెద్దన్నగా నిలిచిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa