ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలికిపురం గ్యాస్ ప్రమాదం.... అధికారుల కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 07:58 PM

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన భయాందోళనకు గురి చేస్తోంది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి సోమవారం మధ్యాహ్నం గ్యాస్ లీకైంది. పెద్ద ఎత్తునగ్యాస్ లీక్ కావటం.. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓఎన్జీసీ మోరీ -5 వెల్‌లో గ్యాస్ లీకై.. మంటలుచెలరేగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సుభాష్‌లతో పాటుగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గ్రామస్థులకు ఇబ్బందులు కలగకుండా వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఓఎన్జీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. ఎప్పటికప్పుడు తనకు వివరాలు తెలియజేయాలని చంద్రబాబు అధికారులనుు ఆదేశించారు.


మలికిపురం గ్యాస్ లీక్.. స్థానికులకు మాస్కులు


మరోవైపు ఇరుసుమండ గ్యాస్ లీక్ ఘటనపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీలతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వారికి మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మరోవైపు బ్లోఅవుట్ జరిగిన ప్రాంతాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు.


"1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న ఓఎన్జీసీ వెల్‌లో బ్లోఅవుట్ జరిగింది. 2024లో డీప్ అనే కంపెనీకి దీనిని సబ్ లీజుకు ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులో ఒక లేయర్‌లో ఎక్స్‌ప్లరేషన్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 11:30కి గ్యాస్ లీకైంది. ఆ బావిలో నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాస్ బయటకు వచ్చింది. గంటపాటు గ్యాస్ బయటకు వచ్చింది. 12:30 గంటల నుంచి మంటలు మొదలయ్యాయి. వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాం."


"20,000 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అంచనా వేస్తున్నారు. కిలోమీటర్ పరిధిలో ఉన్న వారిని ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించాం. మంటలు ఆర్పేందుకు ఓఎన్‌జీసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియదు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. " అని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.


మరోవైపు గ్యాస్ లీక్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉండటంతో ఇరుసుమండలో పెద్ద ఎత్తున కొబ్బరిచెట్లు మంటల్లో కాలిపోతున్నాయి. సుమారుగా 500కిపైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అంచనా. అలాగే గ్యాస్ లీక్, మంటల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇరుసుమండ గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నారు. 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa