అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసం వద్ద సోమవారం తెల్లవారుజామున కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సీక్రెట్ సర్వీస్, సిన్సినాటి పోలీసులు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు., ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:15 గంటలకు జేడీ వాన్స్ నివాసం సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పరుగెడుతున్నట్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయి ఉండటాన్ని గమనించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు స్పష్టం చేశారు. సెలవుల అనంతరం ఆదివారమే ఆయన వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా సీక్రెట్ సర్వీస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa