బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
డిసెంబర్ నివేదికలో షాకింగ్ నిజాలు
బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.
కొత్త ఏడాది మొదలైనా హింస తగ్గకపోవడం గమనార్హం. జనవరి 2న లక్ష్మీపూర్లో సత్యరంజన్ దాస్ అనే రైతు వరి పొలానికి నిప్పు పెట్టారు. మరుసటి రోజు షరియత్ పూర్లో వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్ను కిరాతకంగా నరికి, నిప్పు పెట్టి చంపేశారు. ఛటోగ్రామ్, కుమిల్లా ప్రాంతాల్లో సాయుధ దుండగులు కుటుంబాలను బందీలుగా చేసి బంగారం, నగదు దోచుకున్నారు. ఝెనైదాలో ఓ హిందూ విధవరాలిని సామూహిక అత్యాచారం చేసి, గుండు గీసి, చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. జెసోర్లో ఐస్ ఫ్యాక్టరీ యజమాని రామ ప్రతాప్ బైరాగిని బహిరంగంగా గొంతు కోసి చంపడం అక్కడి అరాచక పాలనకు పరాకాష్టగా నిలిచింది.
ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు కనిపించడం లేదని, ఆంక్షలు విధించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 3న ఎనిమిది మంది మైనారిటీ ప్రతినిధుల బృందం బీఎన్పీ కార్యనిర్వాహక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ భద్రత, న్యాయం కోసం ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పౌరులందరి హక్కులు కాపాడతామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర యంత్రాంగం నుంచి తక్షణ చర్యలు రాకపోవడం విచారకరం. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు కుట్రగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa