ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా హైదరాబాద్ టీమ్

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 10:56 PM

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) విస్తరణలో భాగంగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు ఆరు జట్లతో కొనసాగిన పీఎస్‌ఎల్‌కు తాజాగా రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరాయి. గురువారం జరిగిన వేలంలో రెండు కొత్త జట్లకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేలంలో మొత్తం 12.75 మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీలో సుమారు రూ.114 కోట్లు చెల్లించి రెండు జట్లను దక్కించుకున్నాయి.


ఓజెడ్ డెవలపర్స్ సంస్థ సియాల్‌కోట్ ఫ్రాంచైజీని రూ.58.38 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్‌కేఎస్ గ్రూప్ రూ.55.57 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. దీంతో పీఎస్‌ఎల్‌లో హైదరాబాద్ అనే కొత్త జట్టు అధికారికంగా ప్రవేశించింది. ఈ హైదరాబాద్ జట్టు ధర ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.


ఐపీఎల్ ‌లో స్టార్ ఆటగాళ్లయిన శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు, రిషభ్ పంత్ రూ.27 కోట్లు ఇద్దరి జీతం కలిపి రూ.53.75 కోట్లు. దాదాపు ఈ ఇద్దరి జీతం మొత్తానికి హైదరాబాద్ పీఎస్‌ఎల్ జట్టు అమ్ముడుపోయింది. అంటే, ఇద్దరు ఆటగాళ్ల ఒక్క సీజన్ ఐపీఎల్ జీతంతోనే పీఎస్‌ఎల్‌లో ఒక జట్టు కొనగలిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ రెండు కొత్త పీఎస్‌ఎల్ జట్లకు కలిపి వచ్చిన ధర కూడా ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 9 ఆటగాళ్ల మొత్తం జీతం రూ.118 కోట్లు కంటే తక్కువగా ఉండటం గమనార్హం.


రెండు జట్లు కొత్తగా రావడంతో.. 2026 సీజన్ నుంచి పీఎస్‌ఎల్‌ను 8 జట్లతో నిర్వహించనున్నారు. కొత్త సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఈ సీజన్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. పీఎస్‌ఎల్ ఏప్రిల్‌లో ముగిసిన తర్వాత ముల్తాన్ ఫ్రాంచైజీని తిరిగి వేలానికి పెట్టనున్నారు. ముల్తాన్ మాజీ యజమాని అలీ తరీన్, పీఎస్‌ఎల్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా ఈసారి వేలం నుంచి తప్పుకున్నాడు.


ఐపీఎల్, పీఎస్ఎల్ మధ్య తేడాలు..


బీసీసీఐ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025 నాటికి ఐపీఎల్ మార్కెట్ వ్యాల్యూ రూ.80 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల వరకు ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ లాంటి ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూనే రూ.800 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీగా లక్నో సూపర్ జెయింట్స్ ఏర్పాటు కోసం సంజీవ్ గోయెంకా సారథ్యంలోని ఆర్పీసీజీ గ్రూప్ రూ.7090 కోట్లు బీసీసీఐకి చెల్లించింది. బీసీసీఐ ఐపీఎల్‌ను తేవడంతో.. పాక్ క్రికెట్ బోర్డు సైతం 2016లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. పాక్ అభిమానులు తమ లీగ్‌ను సూపరో సూపర్ అంటుంటారు. కానీ పీఎస్ఎల్ మార్కెట్ వ్యాల్యూ మొత్తం కూడా రూ.3 వేల కోట్లలోపే ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa